కొత్త సినిమాలు.. అస్సలు సౌండ్ లేదు

బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉన్నా సరే.. శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాలు బరిలోకి దిగాల్సిందే. కొవిడ్ టైంలో కూడా ఓటీటీలో అయినా సరే.. ఏదో ఒక సినిమా రిలీజైందే తప్ప.. ఏ వారాన్నీ ఖాళీగా వదిలేయలేదు. సినిమాల నిర్మాణం తెలుగులో అంతగా పెరిగిపోయింది. థియేటర్లు దొరికినా దొరక్కపోయినా.. ఆల్రెడీ థియేటర్లలో ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నా.. ఇంకా ఏ ఇబ్బందులు ఉన్నా సరే.. కొత్త చిత్రాలను రిలీజ్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం మూడు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను కళకళలాడిస్తున్నాయి.

ఆగస్టు తొలి వారంలో రిలీజైన బింబిసార, సీతారామం చిత్రాలు ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుండగా.. గత వారం వచ్చిన ‘కార్తికేయ-’ హౌస్ ఫుల్స్‌తో రన్ అవుతోంది. వీటికే థియేటర్లు సర్దుబాటు చేయడం కొంచెం కష్టంగా ఉంది. అలాంటిది ఈ వారం ఐదు సినిమాలు కొత్తగా థియేటర్లలో అడుగు పెడుతుండటం గమనార్హం. గురువారం ఆల్రెడీ ధనుష్ డబ్బింగ్ సినిమా ‘తిరు’ థియేటర్లలోకి దిగింది. దీనికి టాక్ బాగానే ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే చాలా ఆప్షన్లు ఉన్నాయి.

‘తిరు’కు పెద్దగా ప్రమోషన్లు లేవు. ఏదో నామమాత్రంగా రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఇక శుక్రవారం చిన్న సినిమాలు చాలానే రిలీజవుతున్నాయి. అందులో సునీల్ ప్రధాన పాత్ర పోషించిన ‘వాంటెడ్ పండుగాడ్’ ఒకటి. రాఘవేంద్రరావు సమర్పణలో రైటర్ శ్రీధర్ సీపాన రూపొందించిన ఈ చిత్రానికి ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. బోలెడంతమంది కమెడియన్లు నటించినప్పటికీ.. దీని ప్రోమోలేవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇక ఫ్లాపుల పరంపరతో అల్లాడుతున్నప్పటికీ సినిమాలు ఆపని ఆది సాయికుమార్ ఈసారి తండ్రి బాటలో పోలీస్ అవతారం ఎత్తి ‘తీస్ మార్ ఖాన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

దీనికి కూడా ఏమంత బజ్ లేదు. ఇంకా కమిట్మెంట్ అంటే అడల్ట్ రేటెడ్ మూవీ, మాటరాని మౌనమిది అనే ఇంకేదో చిన్న సినిమా కూడా రిలీజవుతున్నాయి. కానీ వీటి గురించి ప్రేక్షకులకు అస్సలు పట్టడం లేదు. థియేటర్లలో మూడు మంచి సినిమాలుండగా.. బజ్ లేని ఈ కొత్త చిత్రాల మీదికి జనాల ఫోకస్ వెళ్లట్లేదు. వాటికి చాలా తక్కువ స్క్రీన్లు, షోలు కేటాయించారు. ఇవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే సినిమాల్లాగే కనిపిస్తున్నాయి తప్ప ఎలాంటి ప్రభావం చూపేలా లేవు.