విజయ్ అడిగాడా.. కన్ఫమ్ చేశాడా?

ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా అంటూ ఏదీ చేయలేదు. కానీ అతడికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తెలుగు వెర్షన్‌నే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసి పిచ్చెక్కిపోయారు. అతడికి ఫ్యాన్స్ అయిపోయారు. సౌత్‌లో నాలుగు భాషల్లో రిలీజ్ చేసిన ‘డియర్ కామ్రేడ్’, తమిళంలో నటించిన ‘నోటా’ డిజాస్టర్లు అయినప్పటికీ.. విజయ్ టాలెంట్ ఏంటో ఆయా భాషల్లో అందరికీ తెలిసింది. ఇప్పుడిక అతను ‘లైగర్’ మూవీతో పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ ఎక్కడికి వెళ్లినా యూత్ విరగబడి వస్తున్నారు. అతడిని చూసి వెర్రెత్తిపోతున్నారు. ఇప్పటికే నార్త్ ఇండియాలో కొన్ని మేజర్ సిటీల్లో తిరిగి ‘లైగర్’ను ప్రమోట్ చేసిన విజయ్.. తాజాగా చెన్నైలో ల్యాండయ్యాడు. అక్కడ తనదైన శైలిలో ప్రసంగించి తమిళ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ సందర్భంగా అతను ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమా గురించి మాట్లాడడం విశేషం.

తాను తీసే సినిమాల్లో ఒకదాంతో మరోదానికి కనెక్షన్ పెట్టడం లోకేష్‌కు అలవాటు. తొలి చిత్రం ‘మానగరం’ నుంచి చివరగా తీసిన ‘విక్రమ్’ వరకు అన్నింట్లోనూ కథలు డ్రగ్స్ చుట్టూనే తిరుగుతాయి. పాత్రల్లో సారూప్యత కనిపిస్తుంది. ఒక సినిమాలోని పాత్రల గురించి ఇంకో సినిమాలో ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి కనెక్షన్‌ను మామూలుగా మల్టీవర్స్ అంటారు. లోకేష్ సినిమాలకు ప్రత్యేకంగా ‘లోకి వర్స్’ అని పేరు పెట్టుకున్నారు ఫ్యాన్స్.

దీని గురించి విజయ్ ప్రస్తావిస్తూ.. లోకి వర్స్ అంటే తనకు కూడా చాలా ఇష్టమని.. అందులోకి తనను అతను ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తున్నానని.. అది కచ్చితంగా త్వరలోనే జరుగుతుందని వ్యాఖ్యానించాడు. ఐతే విజయ్ కేవలం లోకేష్ సినిమాలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగాడా.. లేక ఆల్రెడీ వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగి సినిమా ఏమైనా కార్యరూపం దాల్చబోతోందా అన్నది ఆసక్తికరంగా మారింది. లోకేష్ లాంటి ఎగ్జైటింగ్ డైరెక్టర్‌తో విజయ్ లాంటి సెన్సేషనల్ హీరో జత కట్టాడంటే ఆ సినిమా రసవత్తరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.