ఆ రెండు సినిమాలు ఎందుకు ఫ్లాప్ అంటే..

‘అందాల రాక్షసి’ సినిమాతో ఒక వర్గం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న దర్శకుడు హను రాఘవపూడి. తన రెండో చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ద్వితీయార్ధంలో కొంచెం అటు ఇటు అయి అసంతృప్తిని మిగిల్చినప్పటికీ.. అది కూడా కమర్షియల్‌గా మంచి ఫలితమే అందుకుంది. కానీ తన తర్వాతి రెండు చిత్రాలు లై, పడి పడి లేచె మనసు సినిమాలు మాత్రం దారుణమైన ఫలితాలందుకున్నాయి.

రెంటికీ మంచి హైప్ వచ్చినా.. సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. ఆర్థికంగా వాటి నిర్మాతలను అవి మామూలు దెబ్బ కొట్టలేదు. ముఖ్యంగా ‘పడి పడి..’ ఫలితం చూశాక ఇంకో నిర్మాత హనుకు అవకాశం ఇస్తాడా అన్న సందేహాలు వ్యక్తమ్యాయి. కానీ అతను వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో పేరున్న కాస్ట్ అండ్ క్రూతో ‘సీతారామం’ తీశాడు. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది.

శుక్రవారమే ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తన చివరి రెండు చిత్రాలు అంత పెద్ద డిజాస్టర్లు కావడానికి కారణాలేంటో హను ఓ ఇంటర్వ్యూలో వివరించే ప్రయత్నం చేశాడు. ‘‘లై సినిమా విషయంలో రెండు పెద్ద తప్పులు జరిగాయి. ముందుగా నేను అనుకున్న కథలో హీరో వెర్సస్ విలన్ పోరు మాత్రమే ఉంటుంది. పూర్తిగా యాక్షన్ మిళితమైన కథ అది. కానీ తర్వాత దీన్ని కమర్షియల్‌గా మార్చే ప్రయత్నంలో హీరోయిన్ పాత్రను జోడించాం.

ఆ ట్రాక్ పెట్టి రెగ్యులర్ సినిమా లాగా మార్చాం. దాని వల్ల అసలు కథ డీవియేట్ అయింది. ఇక ఈ సినిమా మొదలుపెట్టినపుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశాం. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయాలి. 60 రోజులకు పైగా యుఎస్ షెడ్యూల్లో రోజుకు 20 గంటలు కష్టపడ్డాను. తర్వాత ప్రయాణాల కోసం ఒక పది రోజులు. ఇక్కడ ఒక 15 రోజులు షూట్ చేశాం. ఇలా రిలీజ్ డేట్ అందుకోవడం కోసం విరామం లేకుండా షూటింగ్ చేశాం. రష్ చూసుకుని ఏమైనా మార్చుకునే అవకాశం కూడా లేకపోయింది. అసలు పూర్తి సినిమాను నేను చూడకుండానే రిలీజ్‌కు ఇచ్చేశాం.

అందువల్ల నేనేం తీశానో, సినిమా ఎలా వచ్చిందో ఒక సారి చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. అందువల్ల సినిమా పోయింది. పడి పడి లేచె మనసు విషయానికి వస్తే.. నేను హీరోయిన్‌కు ఉన్న జబ్బును దాచి పెడితే, తర్వాత చూసి ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతారని అనుకున్నా.  కానీ ప్రేక్షకులకు అది చూసి కోపం వచ్చింది. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యానని, ఏం తీస్తున్నానో తెలియకుండా ఏదేదో తీశానని అనుకున్నారు. కానీ అంతిమంగా ఈ తప్పుకు నేనే బాధ్యత తీసుకుంటా’’ అని హను అన్నాడు.