వివాదానికి తెరదించిన అనుపమ

ఏదో వచ్చాం.. నటించాం.. మన పని అయిపోయింది అనుకునే రకం కాదు అనుపమ పరమేశ్వరన్. మలయాళం ఆమె సొంత భాష అయినా.. తనకు ఎక్కువ పేరు తెచ్చి పెట్టిన ఇండస్ట్రీ టాలీవుడ్డే కాబట్టి ఇక్కడ చేసే సినిమాల ప్రమోషన్లలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది అనుపమ. చాలా త్వరగా తెలుగు నేర్చుకుని ఇక్కడి ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తుంటుంది. తన కెరీర్‌కు కీలకమైన ‘కార్తికేయ-2’ సినిమా విషయంలోనూ ఒక దశ వరకు ఆమె చురుగ్గానే వ్యవహరించింది.

కానీ సినిమా రిలీజ్ దగ్గర పడే సమయానికి అనుపమ ప్రమోషన్లలో కనిపించలేదు. అదే సమయంలో నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో అనుపమ గురించి మాట్లాడుతూ.. సెట్స్‌లో తను బాగానే ఉంటుందని, ఆ తర్వాత ఫోన్ చేస్తే ఆన్సర్ చేయదని, అందుబాటులో ఉండదని, ఆమె ప్రమోషన్లకు ఎందుకు రావట్లేదో తెలియట్లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది. నిఖిత్‌తో అనుపమకు ఏమైనా గొడవ జరిగిందా, కాబట్టే ప్రమోషన్లకు దూరంగా ఉందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే అనుపమ వెంటనే ఈ విషయమై క్లారిటీ ఇచ్చేసింది.

తాను వేరే సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నానని, ‘కార్తికేయ-2’ రిలీజ్ డేట్ మళ్లీ మళ్లీ మారడంతో ప్రమోషనల్ షెడ్యూల్ కూడా మారడంతో తాను అందుబాటులో లేకుండా పోయానని వివరణ ఇచ్చింది. ఆమె వివరణ ఇచ్చాక కూడా సందేహాలు అలాగే కొనసాగాయి. నిఖిల్, అనుపమ మధ్య ఏదో తేడా జరిగిందనే చర్చ నడిచింది. ఐతే ఈ ఊహాగానాలకు అనుపమ తెరదించేసింది. ఎట్టకేలకు ఆమె ‘కార్తికేయ-2’ ప్రమోషనల్ ప్రోగ్రాంలో పాల్గొంది.

ఆగస్టు 12 నుంచి 13కు రిలీజ్ డేట్ మారుస్తూ, ఈ విషయాన్ని వెల్లడించేందుకు చిత్ర బృందం బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించగా అందులో అనుపమ పాల్గొంది. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసింది. ఈ ఈవెంట్లో చురుగ్గా వ్యవహరించింది. నిఖిల్‌తోనూ జోకులేస్తూ సరదాగా కనిపించింది. దీంతో ఈ వివాదానికి ఇంతటితో తెరపడినట్లే అని, సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా ఆమె పాల్గొనబోతోందని, రిలీజ్ దగ్గర పడ్డాక మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.