శాకుంతలం.. ఈ ఆలస్యం ఎందుకంటే?

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి థియేటర్లకు వాళ్లను రప్పించడం చాలా పెద్ద సవాలుగా మారిపోతోంది. క్రేజీ కాంబినేషన్లలో తీసిన సినిమాలు కూడా జనాల దృష్టిని ఆకర్షించలేకపోతుండటం ఇండస్ట్రీ వర్గాలను కలవరానికి గురి చేస్తోంది. ప్రి రిలీజ్ బజ్ క్రియేట్ కాకపోతే ఎంత భారీ చిత్రానికైనా ఓపెనింగ్స్ రావట్లేదు. ఇక టాక్ తేడా వస్తే అంతే సంగతులు.

‘ఆచార్య’ లాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పరాభవం ఎదురైందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా హడావుడి చేయడం, ప్రోమోలు క్రేజీగా ఉండేలా చూసుకోవడం, సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవడం కీలకంగా మారుతోంది. ఇలాంటి టైంలో సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా చాలా నెలల నుంచి అసలు చర్చల్లోనే లేదు.

సమంత ఈ సినిమాలో లైనప్‌లో ‘శాకుంతలం’ పేరుతో ఒక సినిమా ఉందన్న విషయాన్నే జనాలు మరిచిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాను సమంత పూర్తి చేసి పది నెలలు దాటిపోయింది. అప్పట్నుంచి అసలు సినిమా వార్తల్లోనే లేదు. ఈ మధ్య చిత్ర నిర్మాత అయిన నీలిమ గుణ.. తమ సినిమా ఈ సంవత్సరమే రిలీజవుతుందని క్లారిటీ ఇచ్చింది తప్ప అంతకుమించి సినిమా గురించి ఏ సమాచారం పంచుకోలేదు. దీంతో సామ్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడు గుణశేఖర్‌ను ట్యాగ్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు సమాధానం చెప్పారు. ‘శాకుంతలం’ భారీ గ్రాఫిక్స్‌తో ముడిపడ్డ సినిమా అని, అందుకోసం చాలా సమయం, శ్రమ అవసరం పడుతున్నాయని.. అందుకే ఈ ఆలస్యం అని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.

ప్రేక్షకులకు బెస్ట్ మూవీ అందించాలన్నదే తమ తాపత్రయం అని, అంత వరకు వేచి చూడాలని ఆయన కోరారు. ఐతే రాజమౌళి ఇంతకంటే భారీ చిత్రాలే తీస్తాడు. ఆయన టీం నెలల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయి ఉంటుంది. కానీ తీరిక లేకుండా ఆ పని చేస్తూనే.. మరోవైపు ఒక క్రమ పద్ధతిలో ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ సినిమాను వార్తల్లో ఉండేలా చూస్తుంది. హైప్ పెంచుతుంది. ఈ విషయంలో గుణశేఖర్ సహా అందరూ రాజమౌళి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.