ఇంకో డైరెక్టర్.. టార్గెట్ అయ్యాడు

అసలే సినిమాల పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిన ఈ రోజుల్లో.. సోషల్ మీడియాకు కొన్ని చిత్రాలు టార్గెట్‌గా మారిపోవడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. రాజకీయాలతో ముడిపెట్టి సినిమాలను లక్ష్యంగా మార్చుకుని నెగెటివ్ ట్రెండ్స్ పెట్టి ట్రోల్ చేయడం… విపరీతమైన దుష్ప్రచారం చేయడం ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్‌గా మారిపోతోంది. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు నోట ‘నేను విన్నాను నేను ఉన్నాను’ డైలాగ్ రావడం.. ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ తనకు వైఎస్ అంటే అభిమానం అని స్టేట్మెంట్ ఇవ్వడం.. ఓ వర్గానికి రుచించలేదు. ఆ సినిమాలో కంటెంట్ వీకే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఒక వర్గం అదే పనిగా దాన్ని టార్గెట్ చేసింది. ఇది సినిమాకు కొంత చేటు చేసింది.

ఇక ఈ మధ్య ‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అతను కమ్మ, కాపు కులాలను దూషించాడని ఆయా వర్గాల వాళ్లు అతణ్ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘మాచర్ల నియోజకవర్గం’ను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు. ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఈ సినిమా పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే ఉంది. ఐతే దీనికి బదులుగా అన్నట్లు..ఇప్పుడో కొత్త సినిమాను మరో వర్గం లక్ష్యంగా చేసుకుంది. ఆ చిత్రమే.. రామారావు ఆన్ డ్యూటీ.

ఈ చిత్రంతో టాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న శరత్ మండవ.. తెలుగుదేశం మద్దతుదారనే విషయం తన పాత ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. గతంలో అతను నారా లోకేష్‌కు మద్దతుగా, వైఎస్‌ జగన్‌కు యాంటీగా కొన్ని ట్వీట్లు పెట్టాడు. అవన్నీ ఇప్పుడు వైకాపా మద్దతుదారులు బయటికి తీస్తున్నారు. జగన్ వ్యతిరేకులంతా ‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడిని టార్గెట్ చేస్తే.. జగన్ ఫ్యాన్స్ ఇప్పుడు ‘రామారావు’ డైరెక్టర్‌ మీద పడ్డారు.

సినిమాలో కొన్ని డైలాగులు జగన్ సర్కారును టార్గెట్ చేసేలా ఉన్నాయన్న ప్రచారం కూడా దీనికి ఆజ్యం పోస్తోంది. రిలీజ్ ముందు రోజు నుంచే శరత్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టిన వైకాపా మద్దతుదారులు.. శుక్రవారం ఉదయం నుంచి మరింత రెచ్చిపోతున్నారు. ‘రామారావు’ టాక్‌ను అనుసరించి అతడి మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. అందులోనూ ఫస్ట్ డే ఫస్ట్ షో అప్‌డేట్స్ గురించి, ట్విట్టర్ రివ్యూల గురించి శరత్ నెగెటివ్ కామెంట్లు చేసిన నేపథ్యంలో.. ఆ మాటలు గుర్తు చేస్తూ మరింతగా అతణ్ని ట్రోల్ చేస్తున్నారు.