5 హీరోయిన్లతో చంద్రముఖి 2

సూపర్ స్టార్లు సైతం హారర్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని నిరూపించిన సినిమా చంద్రముఖి. 2005లో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ తలైవా అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని ఎవర్ గ్రీన్ క్లాసిక్. దీని సీక్వెల్ ని ఆయనతోనే తీయాలని దర్శకుడు పి వాసు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు.

రెండో భాగాన్ని కన్నడలో విష్ణువర్ధన్ తో హిట్ అయ్యింది కానీ తెలుగులో వెంకటేష్ తో నాగవల్లిగా రీమేక్ చేస్తే ఇక్కడ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు పూర్తిగా కొత్త కథతో చంద్రముఖి 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే

లారెన్స్ హీరోగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ ఒకరో ఇద్దరో కాదట. ఏకంగా ఐదుగురిని తీసుకున్నట్టు చెన్నై అప్ డేట్. లక్ష్మి మీనన్, మంజిమా మోహన్, మహిమా నంబియార్, సృష్టి దాంగే, సుభిక్ష కృష్ణన్ లు లారెన్స్ సరసన ఆడిపాడనున్నారు.

ఇటీవలే మైసూర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళలో చంద్రముఖి ఎవరన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టేశారు. ఫస్ట్ పార్ట్ చేసిన జ్యోతికనే తిరిగి ఇందులో కూడా అదే క్యారెక్టర్ చేస్తారనే ప్రచారం ఉంది కానీ అఫీషియల్ అప్డేట్ లేదు.

సో చంద్రముఖిలో దెయ్యాలతో పాటు పుష్కలంగా గ్లామర్ ని కూడా దట్టించబోతున్నారు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న చంద్రముఖి 2కి సుమారు వంద కోట్ల దాకా బడ్జెట్ కేటాయించినట్టు కోలీవుడ్ టాక్. ఈ మధ్య బొత్తిగా కనిపించడం తగ్గించేసిన లారెన్స్ డిసెంబర్ లో రుద్రుడుతో పలకరించనున్నాడు. ఆ తర్వాత వచ్చేది లకలకనే.

రజిని చేసిన పాత్రలో పరకాయ ప్రవేశం చేయబోతున్న లారెన్స్ మీద అంచనాల పరంగా చాలా ఒత్తిడి ఉంది. ఏ మాత్రం అటుఇటు అయినా కష్టం. అందుకే దర్శకుడు పి వాసు మొదటి భాగంతో సంబంధం లేకుండా డిఫరెంట్ ప్లాట్ సెట్ చేశారట