ట్విట్ట‌ర్ రివ్యూ విమ‌ర్శ‌ల‌పై ద‌ర్శ‌కుడి వివ‌ర‌ణ‌

యుఎస్ ప్రిమియ‌ర్స్ ముగిసీ ముగియ‌క ముందే రివ్యూలు రాసే వారి మీద‌, అలాగే ట్విట్ట‌ర్లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అప్‌డేట్స్ ఇచ్చే వారిపై కొంచెం ఘాటుగానే విమ‌ర్శ‌లు చేశాడు ‘రామారావు-ఆన్ డ్యూటీ’ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ట్విట్ట‌ర్లో అప్‌డేట్స్ ఇచ్చే వారిపై అత‌ను చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ట్విట్ట‌ర్లో సినిమా రివ్యూలు చూడ‌డం మానేస్తే అంద‌రూ బాగు ప‌డ‌తార‌ని అత‌ను వ్యాఖ్యానించాడు. ఈ విష‌యంలో కొంద‌రి నుంచి కౌంట‌ర్లు కూడా ప‌డ్డాయి శ‌ర‌త్ మీద‌.

ఐతే త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశం ఏంటో ఈ సినిమా ప్రి రిలీజ్ మీడియా ఇంటర్వ్యూల్లో శ‌ర‌త్ వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న‌కు రివ్యూల ప‌ట్ల ఎలాంటి వ్య‌తిరేక భావం లేద‌ని, నిజానికి తాను రివ్యూల నుంచి చాలా నేర్చుకున్నాన‌ని అత‌ను వివ‌రించాడు.

‘‘సినిమా అనేది వంద‌లాది మంది స‌మ‌ష్టి కృషి, క‌ష్టానికి ఫ‌లితం. సినిమాను పూర్తిగా చూసి అర్థం చేసుకుని దాని గురించి స‌మీక్ష రాయ‌డంలో నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు. రివ్యూలు ఉండాలి. అవి చ‌దివి నేను చాలా నేర్చుకున్నా. రివ్యూలు విశ్లేషణాత్మ‌కంగా, నిర్మాణాత్మ‌కంగా ఉంటే మంచిదే. తెలుగులో మంచి రివ్యూలు రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఆ విష‌యం ప‌క్క‌న పెడితే సినిమా షో న‌డుస్తుండ‌గానే.. ఇది తొలి పాట‌, ఇది ఫ‌స్ట్ ఫైట్, ఇలా ఉంది అలా ఉంది అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో అప్‌డేట్స్ ఇచ్చేస్తున్నారు. దీని వ‌ల్ల సినిమా చూసే ఎక్స్‌పీరియ‌న్స్ పోతుంది. ఈ ప‌ద్ధ‌తి స‌రైంది కాదు. ఒక ప్రోడ‌క్ట్ వినియోగ‌దారుడికి చేర‌క‌ముందే ఒంత నెగెటివిటీ ఎందుకు అన్న‌ది నా ప్ర‌శ్న‌. ఇది మారాల‌న్న‌ది నా ఉద్దేశం’’ అని శ‌ర‌త్ అన్నాడు.

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన రామారావు-ఆన్ డ్యూటీ ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంతోనే స్వయంవరం, చిరునవ్వుతో సినిమాల హీరో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటించిన ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు.