బ్రహ్మానందం జోక్.. జక్కన్న థియరీ

లాక్ డౌన్ టౌంలో థియేటర్లన్నీ మూత పడటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే వీటికి జనాలు ఓ మోస్తరుగా అలవాటు పడగా.. లాక్ డౌన్ టైంలో ఇంకా అడిక్ట్ అయిపోతున్నారు. కొన్ని నెలల పాటు ఓటీటీల్లో విరగబడి సినిమాలు చేసి బాగా అలవాటు పడిపోయిన తర్వాత జనాలు అసలు థియేటర్లకు వస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మళ్లీ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియదు.. అవి తెరుచుకున్నా జనాల నుంచి స్పందన ఎలా ఉంటుందో తెలియదు.. ఈ నేపథ్యంలో థియేటర్ ఇండస్ట్రీ కుదేలైపోతుందని.. వాటి మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

ఐతే ఈ విషయంలో మరీ భయపడాల్సిన పని లేదని అంటున్నాడు రాజమౌళి. లాక్ డౌన్ టైంలో జనాలు ఓటీటీలకు అలవాటు పడటం సమస్యే అని.. అంతమాత్రాన థియేటర్ ఇండస్ట్రీ పూర్తిగా నాశనం ఏమీ అయిపోదని జక్కన్న చెప్పాడు.

ఈ విషయంలో జక్కన్న ఉదాహరణలతో ఒక థియరీని వివరించే ప్రయత్నం చేశాడు. 80ల్లో టీవీల విప్లవం మొదలైనపుడు.. జనాలు ఇక టీవీలకు పరిమితం అయిపోతారని.. థియేటర్లకు రారని ఆందోళన వ్యక్తమైందని.. కానీ టీవీల పోటీని తట్టుకుని థియేటర్లు నిలబడ్డాయని జక్కన్న చెప్పాడు. ఆ తర్వాత స్టార్ కేబుల్ వచ్చాక రోజుకు మూడు కొత్త సినిమాలు ప్రసారం అవుతుండటంతో అప్పుడు కూడా థియేటర్ల మనుగడ గురించి చర్చ జరిగిందని.. కానీ ఆ దశను కూడా అధిగమించాయని చెప్పాడు రాజమౌళి.

ఇప్పుడు ఓటీటీల వల్ల కూడా థియేటర్ల భవిష్యత్తుపై సందేహాలు కలుగుతున్నాయని ఆయన అన్నాడు. ఐతే టీవీలు వచ్చి వాటికంటూ ప్రత్యేకమైన ప్రేక్షకుల్ని తయారు చేసుకున్నట్లే.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ సైతం ఓ వర్గం ప్రేక్షకుల్ని తమ వైపు తిప్పుకున్నాయన్నాడు. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా థియేటర్లకెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకుల్ని కొంతమేర ఓటీటీలు లాగేసుకుంటాయనడంలో సందేహం లేదని.. అలాగని పూర్తిగా థియేటర్ల వ్యవస్థ ఏమీ దెబ్బ తినదని అభిప్రాయపడ్డాడు.

మనిషి సంఘజీవి అని.. సొసైటీతో కలిసి వినోదాన్ని ఆస్వాదించాలని అనుకుంటానడని.. బ్రహ్మానందం జోక్‌ను ఫ్యామిలీతో కలిసి ఇంట్లో చూసేటపుడు నవ్వే తీరు ఒకలా ఉంటుందని.. మొబైల్లో ఒంటరిగా చూసేటపుడు ఒకలా నవ్వుతామని.. వీటికి భిన్నంగా థియేటర్లలో జనాలతో కలిసి నవ్వే తీరు మరోలా ఉంటుందని.. మెజారిటీ ప్రేక్షకులు మూడో తరహాలో నవ్వాలనే కోరుకుంటారని.. కాబట్టి థియేటర్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదని జక్కన్న విశ్లేషించాడు.