రామ్ చరణ్ తో సినిమా – లోకేష్ క్లారిటీ

ఇటీవలే విడుదలైన విక్రమ్ రూపంలో లోకనాయకుడు కమల్ హాసన్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాక ఆయన అప్పులన్నీ తీరేందుకు కారణమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి బాలీవుడ్ లోనూ చర్చలు జరుగుతున్నాయి. అక్కడి తలలు పండిన స్టార్లు సైతం ఒకవేళ ఇతను ఒప్పుకుంటే ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు. కానీ లోకేష్ మాత్రం ఓన్లీ సౌత్ సూత్రంతో ఇక్కడి వాళ్ళతోనే చేసేందుకు కట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య రామ్ చరణ్ తో తను చేసే అవకాశాల గురించి గట్టి ప్రచారం జరిగింది.

అది నిజమా కాదా అనే అయోమయం ఫ్యాన్స్ లోనూ నెలకొంది. దానికి లోకేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్టు మీద స్పష్టంగా ఓపెన్ అయ్యాడు. దాని ప్రకారం లోకేష్ కనగరాజ్ చరణ్ ను హైదరాబాద్ లో కలిశాడు. ఇద్దరి మధ్య మీటింగ్ జరిగింది. మెగా పవర్ స్టార్ ఆతిథ్యం, వ్యక్తిత్వం గురించి అంతగా అవగాహన లేని లోకేష్ తనను రిసీవ్ చేసుకున్న తీరు చూసి షాక్ అయ్యాడు. అంత పెద్ద హీరో అయ్యుండి ఇంత సింపుల్ గా ఉండటం షాక్ కు గురి చేసింది. అలా ఒక దఫా మీటయ్యారు

ప్రస్తుతం లోకేష్ చేతిలో రెండు మూడు కమిట్ మెంట్లు ఉన్నాయి. ముందు విజయ్ ది పూర్తి చేయాలి. ఆ తర్వాత ఖైదీ 2 ఉంటుంది. అదయ్యాక విక్రమ్ సీక్వెల్ లో కమల్, సూర్య, కార్తీలను కలిపి ఒక మల్టీవర్స్ మూవీ ఇవ్వాలి. ఇటు చరణ్ ని చూస్తే శంకర్ ప్యాన్ ఇండియా సినిమా చేశాక గౌతమ్ తిన్ననూరితో జాయినవ్వాలి. ఎంత లేదన్నా 2024 వచ్చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ ఇవి ఫినిష్ చేసుకున్నాక అప్పుడు చేతులు కలుపుతారు. తమ కాంబినేషన్ ది బిగ్గెస్ట్ ఉంటుందని లోకేష్ నొక్కి చెప్పడం చూస్తే ఫ్యాన్స్ గాల్లో తేలడం ఖాయం.