ప్ర‌కాష్ రాజ్.. మ‌న‌లో ఒక‌డు

ప్ర‌కాష్ రాజ్ కేవ‌లం న‌టుడే కాదు.. నిర్మాత‌, ద‌ర్శ‌కుడు కూడా. ఆయ‌న ఇప్ప‌టికే స్వీయ ద‌ర్శ‌కత్వంలో నాలుగు చిత్రాలు నిర్మించారు. ఐతే అవేవీ సొంత క‌థ‌ల‌తో తీసిన స్ట్రెయిట్ సినిమాలు కావు. ధోని ఓ మ‌రాఠీ సినిమాకు రీమేక్ కాగా.. ఉల‌వ‌చారు బిరియాని మ‌ల‌యాళ రీమేక్. అలాగే క‌న్న‌డ‌లో ఆకాశ‌మంత చిత్రాన్ని రీమేక్ చేశారాయ‌న‌. తెలుగులో మ‌న వూరి రామాయ‌ణం పేరుతో ప్ర‌కాష్ రాజ్ తెర‌కెక్కించిన చిత్రం కూడా రీమేకే కావ‌డం గ‌మ‌నార్హం.

ఇందులో ఏ సినిమా కూడా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. ప్ర‌కాష్ రాజ్‌కు మంచి పేరు త‌ప్ప డ‌బ్బులు తెచ్చిపెట్ట‌లేదు. దీంతో చాన్నాళ్లుగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉన్నారు. కానీ త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నార‌ట‌. మన‌లో ఒక‌డు పేరుతో ఓ కొత్త సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌కాష్ రాజ్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

మ‌ళ్లీ ద‌ర్శ‌కత్వం వహించ‌బోతుండ‌డం గురించి ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ.. వృత్తిపరంగా, గుర్తింపుపరంగా, రిలెవెన్స్‌ పరంగా నేను ముందు నటుణ్ణి. నటుడిగా ఇంకొకరి పెయింటింగ్‌లో నేను కలర్‌ని. కొన్ని పెయింటింగ్‌లు మనమే గీయాలనిపిస్తుంది. ఇప్పుడు ‘మనలో ఒకడు’ అనే సినిమా డైరెక్ట్‌ చేయబోతున్నాను. నాకు చెప్పాలనిపించింది కాబట్టి నేను ఏ సినిమా డైరెక్ట్‌చేసినా నేనే నా స్వార్జితంతో నిర్మిస్తాను అని ప్ర‌కాష్ రాజ్ తెలిపాడు.

ఐతే ప్ర‌కాష్ రాజ్ తెలిసి అన్నాడో తెలియ‌క అన్నాడో కానీ.. మ‌న‌లో ఒక‌డు అనే టైటిల్‌తో ఇప్ప‌టికే ఓ సినిమా వ‌చ్చింది. అది మ‌రీ పాత సినిమా కూడా కాదు. 2016లో విడుద‌లైంది. ఆ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించ‌డ‌మే కాక ద‌ర్శ‌క‌త్వం కూడా త‌నే చేశాడు సంగీత ద‌ర్శ‌కుడు ఆర్పీ ప‌ట్నాయ‌క్. అది సొసైటీలో ఓ కీల‌క స‌మ‌స్య చుట్టూ తిరిగే సినిమా. ప్ర‌కాష్ రాజ్ సైతం సామాజిక, రాజ‌కీయ‌ అంశాల నేప‌థ్యంలో ఈ సినిమా చేయాల‌ని భావిస్తున్న‌ట్లున్నాడు. మ‌రి ఇదే పేరుతో సినిమా ఉంద‌ని తెలిస్తే ఆయ‌నే టైటిల్ పెడ‌తారో?