వెంకీ.. ఫిక్సయినట్లేనా?

ఇటీవలే ‘ఎఫ్-3’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. కరోనా టైంలో మిగతా హీరోలతో పోలిస్తే వెంకీ మంచి స్పీడే చూపించాడు. చకచకా రీమేక్ సినిమాలు నారప్ప, దృశ్యం-2లను పూర్తి చేసి వాటిని ఓటీటీల్లో రిలీజ్ చేసిన వెంకీ.. ఆ తర్వాత ‘ఎఫ్-3’ని థియేటర్లలోకి దించాడు. ఇవి మూడు వాటి వాటి స్థాయిలో మంచి స్పందనే తెచ్చుకున్నాయి. ఐతే కరోనా టైంలోనూ ఏమాత్రం అవకాశం దొరికినా షూటింగ్‌లో పాల్గొంటూ చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేసిన వెంకీ.. ఇప్పుడు మాత్రం తాపీగా కనిపిస్తున్నాడు. కొత్త సినిమాల విషయంలో ఎటూ తేల్చకుండా సైలెంటుగా ఉన్నాడు.

నిజానికి ఈ టైంకి వెంకీ.. తరుణ్ భాస్కర్‌తో కొత్త సినిమా చేయాల్సింది. కానీ వాళ్లిద్దరి మధ్య కథా చర్చలు ఒక కొలిక్కి రాక.. ఆ కలయిక సాధ్యపడలేదు. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి వెంకీ ఒప్పుకున్నాడు కానీ.. దాని షెడ్యూల్ మొదలవడానికి సమయం ఉంది. దీంతో వెంకీ ప్రస్తుతానికి ఖాళీనే. ఐతే అతి త్వరలో వెంకీ కొత్త చిత్రం గురించి ప్రకటన రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీతో వెంకీ సినిమా దాదాపు ఓకే అయినట్లే చెబుతున్నారు. వీరి కాంబినేషన్ గురించి ఇంతకుముందే వార్తలొచ్చాయి. కానీ ఆలోపే అనుదీప్.. తమిళ హీరో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ సినిమాను లైన్లో పెట్టాడు. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. దీపావళికి విడుదల అవుతుంది. అది రిలీజవ్వగానే వెంకీతో అనుదీప్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని అంటున్నారు. మరి కామెడీ పండించడంలో తిరుగులేని వెంకీతో.. ఈ తరం అభిరుచికి తగ్గట్లుగా నవ్వించగలడని పేరున్న అనుదీప్ మంచి కామెడీ ఎంటర్టైనర్ తీస్తాడేమో చూడాలి.