విజయేంద్ర ప్రసాద్.. ఓ సంచలన సినిమా

ఇప్పుడు ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న రైటర్ అంటే విజయేంద్ర ప్రసాదే. బాహుబలి, భజరంగి భాయిజాన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ఆయన కీర్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరింది. 80 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో చురుగ్గా కనిపిస్తూ, కొత్త సినిమాలకు కథలు రాస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే మోడీ సర్కారు ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆయన రాజమౌళి-మహేష్ బాబు కలయికలో రాబోతున్న సినిమాకు కథ రాసే పనిలో ఉన్నారు. దాంతో పాటుగా రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో సినిమా చేయడానికి చాలామంది ప్రయత్నించారు కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. చివరికి సుకుమార్ సైతం తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల మీద రీసెర్చ్ చేసి ఓ కథ రెడీ చేయాలని గతంలో ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు.

కాగా ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. కాగా బీజేపీ ప్రభుత్వం విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం, ఇటీవలే ఆ పార్టీ నేతలు ఆయన్ని కలవడంతో.. ఇదే సమయంలో ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రకటించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ నేతల ప్రోద్బలంతో, వారి ఆర్థిక సహకారంతోనే ఈ సినిమానే తెరకెక్కనుందనే ప్రచారం కూడా ఊపందుకుంది.

దీనిపై విజయేంద్ర క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను కథ తయారు చేస్తున్న సమయంలో వారు నన్ను కలవడం కాకతాళీయం. ఈ సినిమాకు వారికి సంబంధమే లేదు. నా సినిమాకు నిర్మాతలెవరో త్వరలో వెల్లడిస్తా. ఈ చిత్రానికి నేను కథ మాత్రమే అందిస్తా. దర్శకత్వం చేయబోను. నేను హిందీలో కథ అందించిన ‘బజరంగీ భాయిజాన్‌’ చిత్రంలో హీరో ఆంజనేయ స్వామి భక్తుడు. పాకిస్థాన్‌ నుండి ఇండియాకి వచ్చిన ఓ చిన్నపాప ఇక్కడ తప్పిపోతే, హీరో ఆమెను ఎలా తిరిగి తన ఇంటికి చేర్చాడన్నదే ఆ చిత్ర కథ. ఇందుకోసం ఆయన పాకిస్థాన్‌తో ఎలాంటి యుద్ధం చేయలేదు. రజాకార్ల నేపథ్యంలో నేను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉన్న చోట వేదన ఎక్కువగా ఉంటుంది. ఆ వేదనను అధిగమించి కూడా మానవత్వం చూపిస్తే అది గుండెలకు హత్తుకుంటుంది. మంచి సినిమా అవుతుంది. సినిమా పరంగా మంచి డ్రామా పండుతుందని రజాకార్ల నేపథ్యాన్ని ఎన్నుకున్నాను. అంతే. సినిమా చూశాక జనం కళ్లనీళ్లతో బయటకు రావాలి. అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు’’ అని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు.