‘ఆదిపురుష్’ తర్వాత ఆ సినిమా


సినీ రంగంలో జాతకం మారిపోవడానికి ఒక్క శుక్రవారం చాలు. ముఖ్యంగా దర్శకుల విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కెరీర్‌ను ‘తానాజీ’ మార్చేసింది. అంతకుముందే అతను కొన్ని సినిమాలు తీసినా రాని పేరు.. ‘తానాజీ’తో వచ్చింది. ఈ చారిత్రక గాథను వెండి తెర మీద గొప్పగా ప్రెజెంట్ చేయడంతో ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌తో 500 కోట్ల బడ్జెట్లో ‘ఆదిపురుష్’ తీసే అవకాశం వచ్చింది అతనికి.

రెండేళ్లకు పైగా అతను ఈ ప్రాజెక్టుకే అంకితమై ఉన్నాడు. గత ఏడాదే చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇది రిలీజయ్యే టైంకి ఓం కొత్త సినిమా మొదలు కాబోతోంది. ‘ఆదిపురుష్’ తర్వాత ఇదే స్థాయిలో ఓ భారీ చిత్రం చేయబోతున్నాడు ఓం రౌత్. ఆ ప్రాజెక్టు.. శక్తిమాన్ కావడం విశేషం.

90వ దశకంలో టెలివిజన్‌ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసి.. దేశవ్యాప్తంగా పిల్లల్ని ఉర్రూతలూగించి.. పెద్ద వాళ్లను కూడా ఆకట్టుకున్న ‘శక్తిమాన్’ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖేష్ ఖన్నా నటించిన ఈ బ్లాక్ బస్టర్ క్యారెక్టర్‌ను వెండి తెర మీదికి తీసుకురావడానికి సోనీ పిక్చర్స్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయబోతున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాకపోతే అంత పాపులర్ క్యారెక్టర్‌ను వెండి తెర మీద ప్రెజెంట్ చేసే దర్శకుడు ఎవరు అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది.

తానాజీ, ఆదిపురుష్ ప్రాజెక్టులతో ఇలాంటి ప్రాజెక్ట్‌ను డీల్ చేయగల అర్హత సంపాదించుకున్న ఓం రౌత్‌కే సోనీ పిక్చర్స్ ఈ బాధ్యతను అప్పగించిందట. మరి శక్తిమాన్‌గా కనిపించేదెవరన్నది ఆసక్తికరం. వందల కోట్ల బడ్జెట్, సోనీ పిక్చర్స్ నిర్మాణం, ఓం రౌత్ దర్శకత్వం అంటే కచ్చితంగా ఓ సూపర్ స్టార్ హీరోనే ఈ పాత్ర చేయడం గ్యారెంటీ. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుంది.