కృష్ణ‌వంశీ నిజాయితీ


గులాబితో మొద‌లు పెట్టి తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమాలు అందించిన‌ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ఎప్పుడూ కూడా తన గురించి తాను గొప్ప‌లు పోడు. అలాగే త‌న సినిమాల గొప్ప‌ద‌నం గురించి కూడా ఊద‌ర‌గొట్ట‌డు. చాలామంది ద‌ర్శ‌కుల్లా స‌రిగా ఆడ‌ని సినిమాలు కూడా సూప‌ర్ అని డ‌ప్పు కొట్టుకోడు. తాను తీసిన ఫ్లాప్ సినిమాల గురించి, అలాగే త‌న లోపాల గురించి కూడా ఆయ‌న ఎప్పుడూ నిజాయితీగానే మాట్లాడతాడు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కృష్ణ‌వంశీ ఇలాగే నిజాయితీగా చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అభిమానులను ఆక‌ట్టుకునేవే. చాలా ఏళ్ల నుంచి స‌రైన సినిమాలు తీయ‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న మార్కెట్ దెబ్బ తిని నిర్మాత‌లు త‌న‌తో సినిమా చేయ‌డానికి భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని నిజాయితీగా అంగీక‌రించ‌డం విశేషం.

సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన త‌న చివ‌రి చిత్రం న‌క్ష‌త్రం డిజాస్ట‌ర్ అయింద‌ని, దానికి ముందు నానితో చేసిన పైసా కూడా డిజాస్ట‌రే అని.. రామ్ చ‌ర‌ణ్‌తో చేసిన గోవిందుడు అంద‌రివాడేలే యావ‌రేజ్ అని ఆయ‌న పేర్కొన్నాడు. ఇలా త‌న ట్రాక్ రికార్డు బాలేక‌పోవ‌డం వ‌ల్ల నిర్మాత‌లు త‌న‌తో ప‌ని చేయ‌డంపై ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నాడు. నిర్మాత లేక ఇబ్బంది ప‌డే ప‌రిస్థితిని తాను ఎదుర్కొన్న మాట వాస్త‌వ‌మే అని ఆయ‌న‌న్నాడు.

త‌న సినిమాల ప‌రాజ‌యాల గురించి సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తుంటార‌ని.. దానికి తానేమీ బాధ‌ప‌డ‌న‌ని కృష్ణ‌వంశీ అన్నాడు. అదే స‌మ‌యంలో వాళ్లు పొగిడితే ఆనందంగా స్వీక‌రిస్తాన‌ని చెప్పాడు. ద‌ర్శ‌కుడిగా తాను ఎన్ని విజ‌యాలు అందుకున్న‌ప్ప‌టికీ.. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన స‌మయాన్నే తాను త‌న జీవితంలో గోల్డెన్ ఫేజ్‌గా భావిస్తాన‌ని కృష్ణ‌వంశీ చెప్ప‌డం విశేషం. వ‌ర్మ బ‌ల‌వంతం చేస్తే, ఆయ‌న ఆదేశం మేర‌కే తాను మెగా ఫోన్ ప‌ట్టాల్సి వ‌చ్చింద‌ని, అదృష్ట‌వశాత్తూ తాను ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాన‌ని కృష్ణ‌వంశీ పేర్కొన్నాడు.