సందీప్ ఛాయిస్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చట్లా


‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన ఫాలోయింగ్ అలాంటిలాంటిది కాదు. ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ రిలీజైన దగ్గర్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్లు ఎగరేసుకుని తిరిగారు. ‘బాహుబలి-2’తో వాళ్ల ఆనందం పతాక స్థాయికి చేరింది. కానీ ఆ తర్వాత మాత్రం వారికి ఆవేదన తప్పట్లేదు. ‘సాహో’ కోసం సుదీర్ఘ సమయం వేచి చూస్తే పెద్ద షాక్ తగిలింది. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ మరింతగా వారిని నిరాశకు గురి చేసింది. తమ ఆకాంక్షలకు భిన్నమైన కాంబినేషన్లలో ప్రభాస్ సినిమాలు చేయడం వారికి రుచించలేదు. సాహో, రాధేశ్యామ్‌ల తర్వాత అయినా తమ అభిప్రాయాల్ని ప్రభాస్ పరిగణనలోకి తీసుకోవాలని వాళ్లు గట్టిగా కోరుతున్నారు.

మారుతితో ప్రభాస్ కొత్త చిత్రం చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి అతడి ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమా కోసం ప్రభాస్‌తో జట్టు కట్టబోయే హీరోయిన్ విషయంలో వాళ్లు గోల చేస్తున్నారు.

ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కెల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ అనే మరో భారీ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. కానీ ఈ లోపే కాస్ట్ అండ్ క్రూను ఎంపిక చేసే పనిలో పడ్డాడు సందీప్. ‘స్పిరిట్’కు కథానాయికగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్‌ను ఓకే చేసినట్లుగా రెండు రోజుల కిందట సమాచారం బయటికి వచ్చింది. ఇక అంతే.. అప్పట్నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా రచ్చ మామూలుగా లేదు.

బాలీవుడ్ వాళ్లే ఔట్ డేటెడ్ అని పక్కన పెట్టేసిన హీరోయిన్ని ప్రభాస్‌కు జోడీగా తీసుకోవడం ఏంటి.. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న హీరోయిన్‌తో ఇంకా పెళ్లి కాని ప్రభాస్ రొమాన్స్ చేయడమేంటి అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అసలే ప్రభాస్ లుక్స్ విషయంలో ఈ మధ్య చాలా ట్రోలింగ్ జరిగింది. ఇక కరీనా లాంటి సీనియర్ హీరోయిన్‌తో అతను జట్టు కడితే ఇద్దరినీ కలిపి ట్రోల్ చేస్తారని.. ట్రెండీ సినిమాలు తీసే సందీప్ రెడ్డి ప్రభాస్‌కు జోడీగా యంగ్ హీరోయిన్ తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.