టైగర్ సరసన రష్మిక మందన్న

భీష్మ, పుష్పలతో తెలుగులోనూ బలమైన మార్కెట్ సృష్టించుకున్న రష్మిక మందన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళం హిందీ కన్నడ నుంచి వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నా తను మాత్రం జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో జెండా పాతేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఆల్రెడీ ‘మిషన్ మజ్ను’లో సిద్దార్థ్ మల్హోత్రాతో జోడి కట్టింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మూవీ ‘గుడ్ బై’లో కీలక పాత్ర కొట్టేసింది. సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ కాంబోలో రూపొందుతున్న ‘యానిమల్’లోనూ తనే హీరోయిన్. ఇప్పుడు ముచ్చటగా నాలుగో అవకాశాన్ని పట్టేసింది.

ఎంత రొటీన్ కథలతో ఓవర్ ది బోర్డ్ హీరోయిజం చేస్తున్నా తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న టైగర్ శ్రోఫ్ సరసన రష్మిక నటించడం దాదాపు లాక్ అయినట్టే. శశాంక్ ఖైతన్ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఆమె ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలిసింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. విదేశాల్లో కూడా దీని చిత్రీకరణ జరపబోతున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని దఢక్ ద్వారా తెరకు పరిచయం చేసింది ఈ శశాంక్ ఖైతనే

అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానుంది. రష్మిక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘సీతా రామమ్’ పూర్తి చేసింది. విజయ్ సరసన నటిస్తున్న ‘వారసుడు’ త్వరలోనే గుమ్మడికాయ కొట్టేస్తారు. యానిమల్ 2023లో రిలీజవుతుంది. మిగిలిన హిందీ చిత్రాల డేట్లు ఫైనల్ కాలేదు. పుష్ప 2 ది రూల్ ఇంకా షెడ్యూల్స్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచి పాల్గొంటుందనేది తెలియాల్సి ఉంది. పొగరు, సుల్తాన్, ఆడవాళ్లు మీకు జోహార్లు నిరాశపరిచినప్పటికీ ఒక్క పుష్ప సక్సెస్ తోనే రష్మిక గ్రాఫ్ ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది.