‘రామారావు’ వివాదంపై దర్శకుడి క్లారిటీ


మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ గత నెల 17నే విడుదల కావాల్సింది. కానీ ఉన్నట్లుండి వాయిదా పడిపోయింది. రవితేజకు నిర్మాత రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ పెట్టాడని.. అందుకే చివరి షెడ్యూల్ షూటింగ్‌కు అతను హాజరు కావట్లేదని.. అందుకే సినిమా నిరవధికంగా వాయిదా పడిందని అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో కొన్నాళ్ల పాటు ప్రమోషన్లు కూడా ఆగిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి అనిశ్చితి నెలకొంది.

కానీ ఇటీవలే ‘రామారావు’కు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు. జులై నెలాఖరులో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అలాగే సినిమా నుంచి ‘నా పేరు సీసా’ అనే కొత్త పాటను కూడా లాంచ్ చేశారు. రవితేజకు బ్యాలెన్స్ ఉన్న పారితోషకం క్లియర్ చేశాకే సినిమా ముందుకు కదిలిందనే ప్రచారం జరిగింది. ఈ సినిమాకు బ్రేక్ పడిందని గతంలో కూడా వార్తలు రావడం గమనార్హం. అప్పుడేమో స్క్రిప్టు మీద మళ్లీ వర్క్ జరుగుతున్నట్లుగా రూమర్లు వినిపించాయి.

ఈ రెండు ప్రచారాల గురించి దర్శకుడు శరత్ మండవ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తమ సినిమా గురించి మీడియాలో వచ్చిన వార్తల్లో అస్సలు నిజం లేదని శరత్ స్పష్టం చేశాడు. తనకు కూడా ఈ వార్తల్ని కొందరు ఫార్వర్డ్ చేశారని.. ఐతే ఎవరైనా వీటి గురించి తనను వివరణ అడిగి ఉంటే వాస్తవం చెప్పేవాడినని.. తన పనిలో తాను బిజీగా ఉండడంతో అప్పుడు స్పష్టత ఇవ్వలేకపోయానని శరత్ తెలిపాడు. గతంలో సినిమా చిత్రీకరణ కొన్ని రోజులు ఆగడానికి కారణం.. షెడ్యూల్ మారడమే అని శరత్ తెలిపాడు.

ముందు ఫారిన్లో అనుకున్న పాట చిత్రీకరణను కొవిడ్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌కు మార్చామని.. కానీ తర్వాత ఫారిన్లో పరిస్థితి మెరుగుపడడంతో ఇక్కడ క్యాన్సిల్ చేసి అక్కడికే వెళ్లాలనుకున్నామని.. ఈ క్రమంలో అనుమతుల కోసం కొంత సమయం వేచి చూడాల్సి వచ్చిందని శరత్ తెలిపాడు. ఇక తాజాగా రిలీజ్ డేట్ వాయిదా పడడానికి కారణం.. రెండు పాటల చిత్రీకరణ, టాకీ పార్ట్ కొంత బ్యాలెన్స్ ఉండడమే కారణమని.. అంతకుమించి విభేధాలు, వివాదాలు ఏమీ లేవని.. మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అతను స్పష్టం చేశాడు.