త్రిశంకు స్వర్గంలో 2 రీమేకులు

మలయాళంలో ఏదైనా సినిమా హిట్టయితే చాలు మనవాళ్ళు పరిగెత్తుకెళ్లి రీమేక్ రైట్స్ తెచ్చేసుకోవడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ అంతటి వాళ్లే లూసిఫర్, అయ్యప్పనుం కోషియంలను ముచ్చటపడి చేసుకున్నారు. ఎన్నో నెలల క్రితమే నాయట్టు, కప్పెలా హక్కులను అఫీషియల్ గా కొనుకున్న టాలీవుడ్ నిర్మాతలు వాటిని తెరకెక్కించే క్రమంలో బాగా ఆలస్యం చేయడంతో ఇంతకీ అవి వస్తున్నాయా లేక మధ్యలోనే ఆపేసి డబ్బింగ్ రూపంలో ఓటిటికి ఇచ్చారా అనే అనుమానం వస్తోంది.

ముందు కప్పేలా సంగతి చూస్తే సితార సంస్థ స్వంతం చేసుకున్న ఈ సూపర్ హిట్ మూవీని విశ్వక్ సేన్ సిద్ధూ జొన్నలగడ్డ కాంబోలో తీయాలని ప్లాన్ చేసుకుని ఆ మేరకు కొంత భాగం షూట్ కూడా చేశారని టాక్ వచ్చింది. డీజే టిల్లు తర్వాత ఇమేజ్ అమాంతం మారిపోవడంతో సిద్దు మనసు మార్చుకుని ఆ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయ్యాడనే ప్రచారం ఆ మధ్యే జరిగింది. సో ఇప్పుడు వేరే హీరోతో రీ ప్లేస్ చేస్తారా లేక అమాంతం మంగళం పాడేసి లైట్ తీసుకుంటారా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి చప్పుడు లేదు

ఇక గీత ఆర్ట్స్ కొనుకున్న నాయట్టుని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తీయాలని ఓపెనింగ్ కూడా చేశారు. తీరా మొదలయ్యాక బడ్జెట్ తో పాటు క్యాస్టింగ్ ఇష్యూస్ వచ్చి ఆపేశారు. నిన్న తేజ మర్ని(జోహార్-అర్జున ఫల్గుణ)డైరెక్షన్ లో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో గీత వాళ్ళు షురూ చేసిన కొత్త మూవీ అదే నాయట్టని ఇన్ సైడ్ న్యూస్. కనీసం ఫస్ట్ లుక్ వచ్చాకే దాని మీద క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా ఇంతేసి జాప్యం చేస్తే ఓటిటిలో వాటి తాలూకు ఒరిజినల్ వెర్షన్లను సబ్ టైటిల్స్ తో చూసేసిన ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోతుందిగా.