సాయిపల్లవిని ఏమని పొగడాలి?

సాధారణంగా హీరోయిన్లు గ్లామర్‌తోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదిస్తుంటారు. కేవలం వారి నటనకు ముగ్ధులై అభిమానులుగా మారే వాళ్లు తక్కువగా ఉంటారు. హీరోయిన్ల నటన చూడటానికి థియేటర్లకు రావడం కూడా చాలా తక్కువమందిలోనే జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు సౌందర్య ఇలాంటి ఇమేజ్‌తోనే తిరుగులేని స్థాయిని అందుకుంది. ఆమె మిగతా హీరోయిన్లలా అందాల విందు చేయలేదన్న మాటే కానీ.. అందం విషయంలో తన ఆకర్షణే వేరు.

తర్వాతి తరంలో త్రిష, నయనతార, అనుష్క, సమంత లాంటి హీరోయిన్లు ఇటు అందం, అటు అభినయంతో ఆకట్టుకున్నారు. అభిమాన గణాన్ని పెంచుకున్నారు. కానీ వీరితో పోలిస్తే సాయిపల్లవి భిన్నమే. ఆమెను ఎవ్వరూ ఎప్పుడూ గ్లామర్ కోణంలో చూడలేదు. కేవలం తన నటనకే ఫిదా అయ్యారు. కేవలం తన నట కౌశలంతోనే పైన చెప్పుకున్న హీరోయిన్లకు దీటుగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకోవడం సాయిపల్లవికే చెల్లింది.

మలయాళ ‘ప్రేమమ్’తో కొంతమేర తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయిపల్లవి.. ‘ఫిదా’తో లక్షల మందిని ఫిదా చేసింది. ఆ తర్వాత కూడా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ‘విరాటపర్వం’ సినిమాకు విడుదల ముంగిట కొంచెం హైప్ వచ్చిందంటే అది సాయిపల్లవికున్న క్రేజ్ వల్లే. కేవలం ఆమె నటన చూడ్డానికే తొలి రోజు లక్షల మంది థియేటర్లకు వచ్చారు. సినిమా ఓవరాల్‌కు మిశ్రమానుభూతి కలిగించినప్పటికీ.. సాయిపల్లవి కోసం వచ్చిన వాళ్లకైతే ఎలాంటి నిరాశ లేదు. అసలీ సినిమా కథ నడిచేదే సాయిపల్లవి పాత్ర చుట్టూ.

రానా సహా అందరినీ పక్కకు నెట్టేసి ప్రతి ఫ్రేమ్‌లోనూ హైలైట్ అవుతూ, తన నటనతో కట్టిపడేస్తూ అభిమానులను మురిపించింది సాయిపల్లవి. సినిమాలో చాలానే క్లోజప్ షాట్లు ఉన్నాయి. వాటిలో ఆమె ఇచ్చిన హావభావాల గురించి ఎంత పొగిడినా తక్కువే. ఎమోషనల్ సీన్లలో కన్నీళ్లు పెట్టించేసింది. నందితాదాస్ లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటితో కాంబినేషన్ సీన్లు చూస్తే సాయిపల్లవి ఎంత గొప్ప నటో అర్థమవుతుంది. ‘విరాటపర్వం’ సినిమాకు అంతిమంగా ఎలాంటి ఫలితం వస్తుందో కానీ.. సాయిపల్లవి కెరీర్లో మాత్రం వెన్నెల పాత్ర ఒక మైలురాయిలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.