ప్రభాస్‌కు పరాభవం తప్పింది

‘బాహుబలి’తో ప్రభాస్ రేంజి్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమాతో మార్కెట్ అసాధారణంగా పెరిగిపోయింది కదా అని.. తన తర్వాతి సినిమాలకు విపరీతంగా ఖర్చు పెట్టేశారు. అవసరం లేని హంగులన్నీ జోడించారు. వాటి వల్ల సినిమాలకు ఒనగూరిన ప్రయోజనం చాలా తక్కువ.

కథాకథనాల కంటే ఈ హంగుల మీద, భారీతనం మీద దృష్టిపెట్టడంతో ప్రేక్షకులకు ఆ సినిమాలు ఎక్కలేదు. విషయం తక్కువ, బిల్డప్ ఎక్కువ అన్నట్లు తయారైన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు.. ప్రభాస్‌ ఎంతమాత్రం కోరుకునే చెత్త రికార్డులు కట్టబెట్టాయి. ఇవి రెండూ ఒకదాన్ని ఒకటి మించి డిజాస్టర్లయి.. ఆయా సమయాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. బయ్యర్లకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు ప్రభాస్‌వే కావడం అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

ముఖ్యంగా ‘రాధేశ్యామ్’ అయితే మరీ నిరాశ పరిచింది. ఓపెనింగ్స్ కూడా సరిగా తెచ్చుకోని ఈ చిత్రం దాదాపు వంద కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. ఇండియాలో మరే సినిమాకూ ఈ స్థాయిలో నష్టం రాలేదు. ఇది ప్రభాస్‌కు ఏమాత్రం రుచించని రికార్డే. ఇప్పట్లో ఈ రికార్డు బద్దలవదు అనుకున్నారు కానీ.. బాలీవుడ్ మూవీ ‘పృథ్వీరాజ్’ పుణ్యమా అని ‘రాధేశ్యామ్’ ఎక్కువ కాలం ఈ రికార్డును మోయాల్సిన అవసరం లేకపోయింది.

దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ దశలోనూ ప్రేక్షకులనూ ఆకట్టుకోలేకపోయింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల షేర్ మార్కును కూడా అందుకోవడం కష్టంగా ఉంది. డిజిటల్ హక్కుల ద్వారా మహా అయితే 50 కోట్ల ఆదాయం వస్తే ఎక్కువేమో.

అలాంటపుడు ఈ చిత్రానికి నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు, క్రిటిక్సే ఈ సినిమా.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తీర్మానించేశారు. కాబట్టి ఈ ట్యాగ్‌ను ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ మోయాల్సిన అవసరం లేనట్లే.