పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అంటే సుందరానికీ’ వేడుకకు ముఖ్య అతిథిగా వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఆ సినిమా హీరో నాని.. పవన్కేమీ సన్నిహితుడు కాదు. ఈ చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయతోనూ పరిచయం లేదు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్తో ఒక సినిమాకు కమిట్మెంట్ ఉంది తప్ప ఇప్పటిదాకా ఆ బేనర్లో సినిమా అయితే చేయలేదు. తన కుటుంబ కథానాయకుల సినిమాల వేడుకలకే రాని పవన్.. ఈ సినిమా వేడుకకు రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ మైత్రీ అధినేతలు పట్టుబట్టి.. దర్శకుడు హరీష్ శంకర్కు చెప్పించి మరీ పవన్ను ఈ వేడుకకు రప్పించారు.
నిజానికి ఇది బుధవారం జరగాల్సిన ఈవెంట్. కానీ పవన్ కోసమని గురువారం పెట్టారు. విడుదలకు కొన్ని గంటల ముందు ఇలా ఈవెంట్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదంతా పవన్ను కచ్చితంగా ఈ ఈవెంట్కు రప్పించడం కోసమే.
మైత్రీ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ చేయాల్సిన ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా విషయంలో విపరీతమైన గందరగోళం నడుస్తోంది. ఈ సినిమా గురించి ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలే వస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా తప్పుకుందని.. సినిమా ఇంకా ఆలస్యం కానుందని.. అసలుంటుందా లేదా అని.. ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ప్రచారాలకు తెరదించి సినిమా కచ్చితంగా ఉంటుందని పవన్తో చెప్పించడానికి, ఆయన్నుంచి పరోక్షంగా ఒక కమిట్మెంట్ తీసుకోవడానికే మైత్రీ అధినేతలు ఇలా ప్లాన్ చేశారు. వాళ్లు కోరుకున్నట్లే పవన్ కూడా ఆ సినిమా ప్రస్తావన తెచ్చాడు.
మైత్రీ బేనర్లో హరీష్ దర్శకత్వంలో అతి త్వరలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా మొదలవుతుందని చెప్పాడు. మరి ఇలా ఓ వేడుకలో ఆ మాట చెప్పాడంటే పవన్ నిలబెట్టుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఎన్నికలుంటాయన్న అంచనాల నేపథ్యంలో పవన్ ఎక్కడ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తాడేమో అన్న భయం మైత్రీ వారిలో ఉంది. అందుకే పవన్ను ఇలా కమిట్ చేయించేశారు. అభిమానులకు కూడా ఇది సంతోషం కలిగించే విషయమే. ఇక హరీష్ శంకర్కు ఇదెంత పెద్ద రిలీఫో చెప్పాల్సిన పని లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates