మహేష్ అండతో రేంజ్ పెరిగింది

అడవి శేష్ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచిన మేజర్ కమల్ హాసన్ విక్రమ్ పోటీని తట్టుకుని మరీ మంచి వసూళ్లు రాబడుతోంది. కమర్షియల్ అంశాలు లేని రియలిస్టిక్ డ్రామా అయినప్పటికీ దేశభక్తి మేళవించిన ఈ నిజ జీవిత గాధ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. విక్రమ్ వల్ల ఇతర రాష్ట్రాల్లో కొంత ప్రభావం ఉన్నప్పటికీ ఏపి తెలంగాణలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు ఇవ్వడం ఖాయమని అర్థమైపోయింది. అయితే ఇక్కడో అంశం గమనించాలి.

మేజర్ కు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి కావడం ప్రమోషన్ పరంగా చాలా ప్లస్ అయ్యింది. నిజాయితీ ఉన్న ప్రయత్నం కావడంతో రిలీజ్ కు ముందు నుంచే మహేష్ చొరవ తీసుకుని మరీ ప్రత్యేకంగా వీడియో షూట్లలో పాల్గొన్నాడు. తన సినిమాకు తప్ప ఇంకెవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని తన శైలిని పక్కనపెట్టి మేజర్ టీమ్ తో ముఖాముఖీ చేశాడు.

దాన్ని రెండో వారంలో వదలడం మంచి మార్కెటింగ్ ఎత్తుగడ. తొమ్మిరోజుల ముందే ప్రీ రిలీజ్ ప్రీమియర్లు వేయడంతో మొదలుపెట్టి పబ్లిసిటీ ప్లాన్లన్నీ పక్కాగా అమలు చేశారు. ఇంత పెద్ద స్టార్ డం ఉన్న హీరో అండగా ఉంటే ఫలితాలు ఆశించిన దానికన్నా గొప్పగా వస్తాయని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు.

ప్రత్యేకంగా మహేష్ ఫ్యాన్స్ విడుదలకు ముందే మేజర్ ని ఓన్ చేసుకున్నారు. సర్కారు వారి పాట రన్నింగ్ లో ఉన్నా సరే దీని ప్రచారానికి ఎలాంటి లోటు రాకుండా సోషల్ మీడియాలో తోడ్పడ్డారు. ఫైనల్ గా పాజిటివ్ టాక్ రావడంతో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వెండితెర మీద కూడా విజయం సాధించాడు. ఇప్పుడీ స్ఫూర్తితోనే జిఎంబి సంస్థ మరిన్ని ప్రాజెక్టులు రెడీ చేయనుంది.