నితిన్ జాక్‌పాట్ కొట్టాడు

యువ కథానాయకుడు నితిన్‌కు కొన్నేళ్ల నుంచి ఏదీ అంతగా కలిసి రావడం లేదు. తన సినిమాలు వరుసగా ఫెయిలవుతున్నాయి. గత ఏడాది స్వల్ప వ్యవధిలో చెక్, రంగ్ దె సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తే.. అవి రెండూ నిరాశ పరిచాయి. రెంటికీ పర్వాలేదనే టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి. దీంతో తన కలల ప్రాజెక్టుగా చెప్పుకున్న ‘పవర్ పేట’ను పక్కన పెట్టేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత అతను ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఐతే ఇలాంటి తరుణంలో అతను నిర్మాతగా ఊహించని విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ఏరియాలో ఒకప్పుడు పేరుమోసిన డిస్ట్రిబ్యూటర్. ఐతే గత కొన్నేళ్లలో ఆయన జోరు తగ్గిపోయింది. సొంత బేనర్ శ్రేష్ట్ మూవీస్ మీద చేసిన కొన్ని సినిమాలు బాగా ఆడినా.. కొన్ని నిరాశ పరిచాయి. ముఖ్యంగా అఖిల్ హీరోగా ఆయన తీసిన ‘అఖిల్’ పెద్ద దెబ్బే కొట్టింది. అప్పట్నుంచి వేరే వాళ్ల సినిమాలను టేకప్ చేయట్లేదు నితిన్ కుటుంబం.

ఐతే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’ను నితిన్ సంస్థ తెలుగులో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. కమల్ మార్కెట్ తెలుగులో బాగా దెబ్బ తినేసిన నేపథ్యంలో ఈ చిత్రానికి రూ.6 కోట్ల తక్కువ మొత్తానికే నితిన్ సంస్థకు ఇచ్చేశారు. సినిమాకు ముందు తెలుగులో అంతగా బజ్ కనిపించకపోవడం, ఫోకస్ అంతా ‘మేజర్’ మీదే ఉండడంతో దీని సక్సెస్ మీద సందేహాలు నెలకొన్నాయి.

తెలుగులో రివ్యూలు కూడా యావరేజ్ అన్నట్లే వచ్చాయి. కానీ మౌత్ టాక్ ఈ సినిమాకు బాగా పని చేసింది. తొలి రోజు సాయంత్రం నుంచి సినిమా బలంగా పుంజుకుంది. వీకెండ్లో హౌస్‌ఫుల్స్‌తో నడిచింది. నితిన్ పెట్టిన పెట్టుబడి వీకెండ్లోనే దాదాపుగా రికవర్ అయిపోయింది. సోమవారం నుంచే వచ్చేదంతా లాభం అన్నట్లే. వీక్‌ డేస్‌లో కూడా సినిమా బలంగానే నిలబడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈవెనింగ్, నైట్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. సినిమా రెండో వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది. ఫుల్ రన్లో నితిన్ పెట్టిన పెట్టుబడి మీద ఈ సినిమా రెట్టింపు వసూలు చేయొచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. కాబట్టి ‘విక్రమ్’తో నితిన్ జాక్ పాట్ కొట్టినట్లే.