మేజర్ రూట్లోనే ‘777 చార్లి’

కొన్ని రోజుల ముందే సినిమాను ప్రీమియర్స్ అంటూ ప్రేక్షకులకు చూపించడమే రిస్కే. ప్రస్తుతం అందుకే ప్రీమియర్స్ వేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. కానీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అడివి శేష్ ‘మేజర్’ సినిమాతో ప్రీమియర్స్ వేస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద తమకున్న కాన్ఫిడెన్స్ తో కొన్ని రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్.

ముందుగా డిల్లీ నుండి మొదలు పెట్టారు. ఇటివలే వైజాగ్ లో కూడా ఫ్రీ షో వేశారు. మేజర్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసినవారంతా సినిమా బాగుందని పబ్లిసిటీ చేస్తున్నారు. అందరికీ తెలిసినే కథే కావడంతో టీం కూడా ఈ రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు అదే రూట్లో కన్నడ హీరో రక్షిత్ కూడా వెళ్లనున్నాడు. రక్షిత్ హీరోగా డాగ్ సెంటిమెంట్ తో ‘777 చార్లి’ తెరకెక్కింది.

ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  సురేష్ ప్రొడక్షన్ బేనర్ పై రానా సమర్పణలో విడుదలవుతుంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాను కూడా మేజర్ లాగే ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. జూన్ 2న డిల్లీ, అమ్రిత్సర్ లలో మొదటి షో పడనుంది. అక్కడ రెండు షోలు వేస్తున్నారు.

ఆ తర్వాత లక్నో , పూనె , త్రివేండ్రం , సోలాపూర్ , చెన్నై , కోల్ కత్తా, మదురై , హైదరబాద్ , వైజాగ్ ఇలా 21 సిటీస్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు. యానిమల్ సెంటిమెంట్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు రక్షిత్ శెట్టి. సినిమాలో ఉన్న ఎమోషన్ ఏ మాత్రం పండినా సినిమా హిట్ అనే భావనతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే మేజర్ లా ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నాడు. మరి ‘777 చార్లి’ కి ప్రీమియర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.