బ్రహ్మస్త్రం వెనుక బ్రహ్మాండమైన ప్లాన్

బాహుబలిని మించే గ్రాండియర్ ని తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బాలీవుడ్ దర్శక నిర్మాతలకు అది తీరని కలగా మిగులుతూ వస్తోంది. దాన్ని టార్గెట్ గా పెట్టుకుని తీసినవన్నీ ఫెయిల్ కావడంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సౌత్ నుంచి వర్షంలా కురుస్తున్న ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కు సమాధానంగా బ్రహ్మాస్త్రను చూపిస్తున్నారు.

మూడు భాగాల ఈ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవాళ వైజాగ్ లో చిన్నపాటి గ్రాండ్ ఈవెంట్ ఒకటి చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరు కాగా హీరో రన్బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరయ్యారు. జూన్ 15 ట్రైలర్ రాబోతున్న విషయాన్ని ఇక్కడే ప్రకటించారు.

అంతా బాగానే ఉంది ఉన్నట్టుండి ఇంత దూరం వచ్చి విశాఖపట్నంలో ఈ వేడుక చేయాల్సిన అవసరం ఏమిటనే సందేహం రావడం సహజం. ఇప్పుడీ యూనిట్ చేతిలో కేవలం 80 రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని భాషల్లో ప్రమోషన్లు చేయాలి. ఆడియన్స్ లో హైప్ పెరిగేలా ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకుని పబ్లిసిటీ వేగం పెంచాలి.

అందులో భాగంగానే ముందు వైజాగ్ నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. తెలుగు వెర్షన్ ని సమర్పిస్తున్న జక్కన్న దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి లాంటి సూచనలన్నీ దగ్గరుండి ఇస్తున్నారట. ఎలాగూ షూటింగు లేక ప్రస్తుతం తగినంత సమయం ఉంది కాబట్టి బ్రహ్మాస్త్రం పార్ట్ వన్ లార్డ్ శివని మోసేందుకు తనవంతు సాయం చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర చేయడంతో ఇక్కడి బిజినెస్ కి ఇది కూడా కీలకం కాబోతోంది.