బొమ్మరిల్లు భాస్కర్‌తో నాగచైతన్య?

‘బొమ్మరిల్లు’ లాంటి ఆల్ టైం హిట్‌తో తనపై భారీగా అంచనాలు పెంచేసి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న దర్శకుడు భాస్కర్. ఐతే తొలి సినిమాతో తనపై పెరిగిన అంచనాలను అతను ఇప్పటిదాకా అందుకోలేకపోయాడు. రెండో సినిమా ‘పరుగు’తో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త, బెంగళూరు నాట్గల్ (తమిళం) లాంటి డిజాస్టర్లు తీసి ఒకేసారి పాతాళానికి పడిపోయాడు.

‘ఒంగోలు గిత్త’ తర్వాత తెలుగులో అతడికి ఇంకో సినిమా రావడానికి చాలా ఏళ్లు పట్టింది. ఒక దశలో అతను మళ్లీ తెలుగులో ఇంకో సినిమా తీయడమే అన్న సందేహాలు కూడా కలిగాయి. ఐతే అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ను మెప్పించి, గీతా ఆర్ట్స్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా తీసి మళ్లీ హిట్టు కొట్టాడు భాస్కర్. ఈ సినిమాకు కూడా యూనివర్శల్ అప్లాజ్ రాలేదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు, పూజా హెగ్డే సూపర్ ఫామ్, ఆమె గ్లామర్ కలిసొచ్చి సినిమా హిట్టయింది.

ఎలాగైతేనేం భాస్కర్ మళ్లీ సక్సెస్ అయితే చూశాడు. దీంతో తర్వాతి సినిమాకు ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అతడికి పేరున్న హీరో, పెత్త నిర్మాతలే సమకూరినట్లు సమాచారం. అఖిల్‌‌కు హిట్ ఇవ్వడంతో ఇంప్రెస్ అయిన అతడి అన్నయ్య నాగచైతన్య.. భాస్కర్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

14 రీల్స్ ప్లస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ బేనర్లో చైతూ ఆల్రెడీ ఓ సినిమా కమిటయ్యాడు. ‘సర్కారు వారి పాట’ కంటే ముందు చైతూతో ఈ బేనర్లో పరశురామ్ ఓ సినిమా చేయాల్సింది. కానీ అనుకోకుండా మహేష్‌తో సినిమా చేసే అవకాశం రావడంతో ఆ ప్రాజెక్టు మీదికి వెళ్లాడు.

కానీ ముందు అనుకున్న కాంబినేషన్లోనే ఇదే బేనర్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. దీని తర్వాత చైతూ.. భాస్కర్‌తో 14 రీల్స్ ప్లస్ బేనర్లోనే ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ‘థ్యాంక్ యు’ను పూర్తి చేసిన చైతూ.. ప్రస్తుతం ఆ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్‌తోనే ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.