దిల్ రాజు నమ్మకాన్ని వమ్ము చేసిన సినిమా?

Dil Raju
Dil Raju

దిల్ రాజును టాలీవుడ్లో అందరూ జడ్జిమెంట్ కింగ్ అని అంటుంటారు. ఆయన నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల సక్సెస్ రేట్ చూస్తే ఈ మాట ఎందుకంటారో అర్థమైపోతుంది. వేరే వాళ్ల సినిమా ఏదైనా ప్రివ్యూ చూసి రాజు బాగుంది అని చెబితే.. దాన్నో సర్టిఫికెట్ లాగా భావిస్తారంటే ఆయనకున్న క్రెడిబిలిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కథ విన్నపుడే ఫలితం చెప్పేస్తారని.. ఇక ఫస్ట్ కాపీ చూసి ఆయన ఓ మాట అన్నారంటే అది అక్షరాలా జరుగుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.

కానీ అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రాజు నుంచి కూడా కొన్ని డిజాస్టర్లు వచ్చాయి. వాటిలో ‘శ్రీనివాస కళ్యాణం’ తనకు అన్నిటికంటే పెద్ద షాకిచ్చిన సినిమా అంటున్నారు రాజు. తన బేనర్లో ‘శతమానం భవతి’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా తీసిన ఈ సినిమాపై రాజు చాలా నమ్మకమే పెట్టుకున్నారట.

రిలీజ్‌కు ముందు ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చూసి చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మారట. కానీ తన అంచనాకు భిన్నంగా సినిమా బోల్తా కొట్టిందని.. వీకెండ్లోనే సినిమా పెర్ఫామెన్స్ తనకు ఆశ్చర్యం కలిగించిందని, సోమవారంతో సినిమా ఆడదని అర్థమైపోయిందని రాజు తెలిపాడు. ఈ సినిమా ఫలితం తిరగబడడంపై రిలీజ్ టైంలో కూడా రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సినిమా మీద అభిప్రాయం చెప్పమని ప్రేక్షకులతో సర్వే చేయిస్తే 75 శాతం పాజిటివ్‌ ఫీడ్ బ్యాక్ ఇచ్చారని.. అయినా సరే సినిమాకు వసూళ్లు రాలేదని అప్పట్లో వాపోయారు రాజు.

ఇదిలా ఉండగా.. రెండేళ్ల కిందట నాన్ బాహుబలి హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమా విడుదలకు ముందు అందులోని ‘బుట్టబొమ్మా’ పాటను తనకు త్రివిక్రమ్ చూపించారని.. అది చూసి వావ్ అంటూ చప్పట్లు కొట్టానని.. సినిమా బ్లాక్ బస్టర్ అని అప్పుడే అర్థమైపోయిందని రాజు తెలిపాడు. ఇక త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా ‘ఎఫ్-3’ ఫస్ట్ కాపీ చూశానని.. గంటన్నర పాటు నవ్వానని.. ప్రేక్షకులు కూడా తన లాగే నవ్వుతారని.. ప్రేక్షకులు లాజిక్కుల గురించి పట్టించుకోకుండా సినిమాను ఎంజాయ్ చేయడం మొదలుపెడితే పూర్తిగా సంతృప్తి చెందుతారని రాజు అభిప్రాయపడ్డాడు.