ఓటిటిల అత్యాశకు ప్రేక్షకుల పాఠాలు

దురాశ దుఃఖానికి చేటు అన్నారు పెద్దవాళ్లు. బంగారు బాతు రోజుకో గుడ్డు పెడుతోందని దాన్ని కడుపు కొస్తే ఏమవుతుంది. అచ్చం ఇలాగే ఆలోచిస్తున్నాయి ఓటిటి సంస్థలు. కెజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ లను పే పర్ వ్యూ మోడల్ లో డబ్బులు కట్టి చూడమని ప్రైమ్, జీ5లు ప్రకటించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది. నెటిజెన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ఇకపై వీటిని రెన్యూవల్ చేసుకోమని హెచ్చరికలు చేస్తున్నారు. సదరు కంపెనీ తాలూకు పోస్టులు ట్వీట్ల కింద క్లాసులు పీకుతున్నారు. ఇప్పటికే వేల కోట్లు దండుకున్న సినిమాలను ఇంకోసారి సొమ్ములు చెల్లించి చూడటమేంటని దుమ్మెత్తి పోస్తున్నారు.

నిజానికి ఈ స్థాయిలో బ్యాక్ ఫైర్ సదరు డిజిటిల్ సంస్థలు ఊహించలేదు. క్రేజ్ ఉంది కదా చూస్తారులే అనే ధీమాతో ప్రయోగం చేయబోయారు. కానీ ఇది బ్యాక్ ఫైర్ అయ్యిందని చెప్పాలి. ఇప్పుడీ పరిణామం వల్ల నైతికంగా తప్పయినా సరే ఆన్ లైన్ లో వీటిని పైరసీ రూపంలో చూసే మార్గాలను ప్రేక్షకులు ఎంచుకుంటున్నారు. అసలే ఇది 5జి కాలం. బ్రాండ్ బ్యాండ్లు ఇస్తున్న స్పీడ్ కి ఎంత పెద్ద జిబి ఫైల్ అయినా సరే నిమిషాల్లో డౌన్లోడ్ అవుతోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేసి మోజు తీరాక డిలీట్ చేసుకోవచ్చు.

ఇలాంటి వాటి పట్ల సామాన్యులకు అవగాహన తక్కువే. కానీ అవసరం ఏదైనా నేర్పిస్తుంది. ఒకప్పుడు ధనిక వర్గానికి మాత్రమే పరిమితమైన స్మార్ట్ ఫోన్ టెక్నాలజి ఇప్పుడు 10 రూపాయలకు పానీపూరి అమ్మేవాడికి కూడా చేరువయ్యింది. అలాంటిది వినోదాన్ని ఖరీదుగా మారుస్తున్నారని జనం ఫీలైనప్పుడు దానికి ప్రత్యాన్మాయాన్ని వెతికి మరీ నేర్చుకుంటారు. ఆల్రెడీ కొన్ని అనఫీషియల్ యాప్స్ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుని చొచ్చుకు పోయాయి. ఇకనైనా ఈ ధోరణిని మానుకుని విదేశాల్లో చందాదారులు, మన దేశంలో వినియోగదారులు ఒకేలా సంపాదించరని, ఆలోచించరని గుర్తిస్తే సభ్యులను జారిపోకుండా కాపాడుకోవచ్చు