‘గండం’ దాటలేకపోయిన మహేష్


ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. వీకెండ్ తర్వాత బలంగా నిలబడడం కష్టమైపోయిన రోజులివి. తొలి వారాంతంలోనే వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవాలి. సోమవారం నుంచి థియేటర్లకు వచ్చే జనం సంఖ్య బాగా తగ్గిపోతుంది. అందుకే వీకెండ్ అయ్యాక వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అవుతుంది. సినిమా ఫలితమేంటన్నది నిర్ణయించేలాగా ఆ రోజు డ్రాప్ ఉంటుంది.

ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా ఆదివారం వసూళ్లతో పోలిస్తే డ్రాప్ 40-50 శాతం ఉంటుంది. ఇక టాక్ అటు ఇటుగా ఉంటే కలెక్షన్లు ఇంకా పడిపోతాయి. గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ డివైడ్ టాక్‌తోనే మొదలై.. వీకెండ్ వరకు బాగానే సత్తా చాటింది. రూ.75-80 కోట్ల మధ్య వీకెండ్ షేర్ వచ్చిందీ చిత్రానికి. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ.45 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. కాబట్టి వీకెండ్ తర్వాత కూడా సత్తా చాటాల్సి ఉంది.

కానీ సోమవారం గండాన్ని ‘సర్కారు వారి పాట’ దాట లేకపోయింది. వసూళ్లు అనుకున్న దాని కంటే ఎక్కువ డ్రాప్ అయ్యాయి. సినిమా ఊపు తగ్గకూడదన్న ఉద్దేశంలో సోమవారం కర్నూలులో వ్యూహాత్మకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసి, మహేష్‌ను సైతం ఆ వేడుకకు రప్పించారు నిర్మాతలు. కానీ దీని వల్ల పెద్దగా ఉపయోగం లేనట్లే కనిపిస్తోంది. విడుదలైన ఐదో రోజు, సోమవారం ‘సర్కారు వారి పాట’ వరల్డ్ వైడ్ షేర్ రూ.3.3 కోట్లు మాత్రమే వచ్చిందన్నది ట్రేడ్ పండిట్ల మాట. ముందు నుంచి అండర్ పెర్ఫామ్ చేస్తున్న నైజాం ఏరియాలో ఈ చిత్రం సోమవారం కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయింది.

ఐదో రోజు తెలంగాణ అంతటా కలిపి రూ.85 లక్షల షేర్ వచ్చినట్లు సమాచారం. నైజాంలో కొన్ని చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడితో పోలిస్తే ఆంధ్రాలో పరిస్థితి కొంత మెరుగే కానీ.. అక్కడ కూడా వసూళ్లలో డ్రాప్ 70 శాతం దాకా ఉంది. మొత్తానికి వీక్ డేస్‌లో ‘సర్కారు వారి పాట’ బండి నడవడం కష్టంలాగే ఉంది. రెండో వీకెండ్లో ‘శేఖర్’ మినహాయిస్తే కాస్త పేరున్న సినిమాలేవీ లేకపోవడం ఈ చిత్రానికి ప్లస్. కాబట్టి వంద కోట్ల షేర్ మార్కుకు అయితే ఢోకా లేకపోవచ్చు.