క్రేజీ బ్రదర్స్ కాంబోలో మల్టీస్టారర్

ఇండస్ట్రీలో తండ్రీకొడుకులు హీరోలుగా రాణించడం సహజమే కానీ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి హయాం మొదలయ్యాక తమ్ముళ్లు కూడా వెలుగులోకి రావడం, స్టార్ డం తెచ్చుకోవడం మొదలయ్యింది. దానికి మంచి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ నే మొదటగా చెప్పుకోవాలి. ఇప్పటి జెనరేషన్ లో నాగ చైతన్య – అఖిల్, సాయి తేజ్ – వైష్ణవ్ తేజ్ ఇలా బ్రదర్స్ గా రాణిస్తున్నవాళ్ళు గట్టిగానే ఉన్నారు. హిందీలోనూ సన్నీ డియోల్- బాబీ డియోల్, సల్మాన్ ఖాన్ – అర్బాజ్ ఖాన్, అనిల్ కపూర్ – సంజయ్ కపూర్ ఇలా అందరూ వెలిగినవాళ్లే.

ఇక కోలీవుడ్ వైపు చూస్తే నువ్వా నేనా అనే రీతిలో విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న వాళ్ళు సూర్య – కార్తీలు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని ఎప్పటి నుంచో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ సరైన కథ దర్శకుడు దొరక్క ఎప్పటికప్పుడు కాంబో లేట్ అవుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఫ్యాన్స్ కల నెరవేరబోతున్నట్టు తమిళ మీడియా టాక్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ సీక్వెల్ గా రూపొందబోయే హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ లో వీళ్ళు కలిసి నటించేందుకు రంగం సిద్ధమయ్యిందని వినికిడి.

ఈ కారణంగానే కమల్ హాసన్ విక్రమ్ లో క్యామియోకు సూర్య ఒప్పుకున్నట్టు తెలిసింది. అందులోనూ తమ్ముడికి ఖైదీ రూపంలో పెద్ద హిట్టు ఇచ్చాడన్న అభిమానం లోకేష్ కనగరాజ్ మీద ఉండనే ఉంది. సో ఈ కలయిక నిజమయ్యే ఛాన్స్ ఎక్కువ. విజయ్ మాస్టర్ తర్వాత ఈ దర్శకుడికి స్టార్ హీరోల ఆఫర్లు క్యూ కడుతున్నాయి. విక్రమ్ సైతం విపరీతమైన అంచానాలు మోస్తోంది. దీని తర్వాత లోకేష్ తీయబోయే సినిమాలో ఒకేతెరపై సూర్యని కార్తీని చూసే అవకాశం దక్కడం అందులోనూ ఖైదీ 2 అంటే అంతకంటే కిక్కేముంది.