చైతూ సినిమాకు ఎట్టకేలకు మోక్షం

యువ కథానాయకుడు నాగచైతన్య కెరీర్లో బాగా ఆలస్యమైన చిత్రాల్లో ‘థ్యాంక్ యు’ ఒకటి. కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం జరిగింది. షూటింగ్ ఎప్పుడో అయిపోయినట్లు అప్‌డేట్ వచ్చినా.. రిలీజ్ సంగతి తేలలేదు.

తన సినిమాల షూటింగ్, రిలీజ్ ప్లానింగ్‌లో ఒక ప్రణాళికతో వ్యవహరించే దిల్ రాజు.. ఈ సినిమా విషయంలో మాత్రం చైతూ అభిమానులను నిరాశ పరిచాడు. ‘మనం’ తర్వాత చైతూ-విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉండగా.. కొన్ని నెలల నుంచి ఇది వార్తల్లో లేకపోవడం పట్ల అక్కినేని ఫ్యాన్స్‌లో అసంతృప్తి వ్యక్తమైంది.

ఈ సినిమా రిలీజ్ సంగతి తేల్చకుండా.. చైతూ-విక్రమ్ కలిసి ‘దూత’ అనే వెబ్ సిరీస్ పనిలో పడిపోయారు. అది పూర్తి కావస్తున్నా.. ‘థ్యాంక్ యు’ రిలీజ్ అప్‌డేట్ మాత్రం రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఐతే ఎట్టకేలకు ‘థ్యాంక్ యు’ టీంలో కదలిక వచ్చింది. సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

జులై 8న ‘థ్యాంక్ యు’ థియేటర్లలోకి దిగబోతోంది. నిజానికి ఆ రోజు నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కావాల్సింది. ఐతే ఆ చిత్రాన్ని ఆగస్టు 11కు వాయిదా వేయడం తెలిసిందే. జులై 8 మీద మరే చిత్రం కూడా కర్చీఫ్ వేయలేదు. ఇప్పుడు ‘థ్యాంక్ యు’ టీం ఆ డేట్‌ను చేజిక్కించుకుంది. ‘థ్యాంక్ యు’ షూటింగ్ గతంలోనే పూర్తయిందని అన్నారు కానీ.. ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో కొంత ప్యాచ్ వర్క్ జరిగింది.

ఏవైనా సన్నివేశాలను రీషూట్ చేశారా.. ఏవైనా సీన్లు బ్యాలెన్స్ ఉంటే వాటిని ఇప్పుడు పూర్తి చేశారా అన్నది తెలియదు. మొత్తానికి ‘థ్యాంక్ యు’ రిలీజ్ సంగతి తేలిపోవడం ఆ చిత్ర బృందంతో పాటు చైతూ ఫ్యాన్స్‌కు కూడా రిలీఫే. ఈ చిత్రానికి కథ అందించింది రైటర్ కమ్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి కావడం విశేషం. ఇందులో చైతూ సరసన రాశి ఖన్నాతో పాటు మాళవిక నాయర్, అవికా గోర్ నటించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం చైతూ విక్రమ్‌తో ‘దూత’ సిరీస్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తర్వాత పరశురామ్ దర్శకత్వంలో అతను సినిమా చేయనున్నాడు.