మేజర్ VS పృథ్విరాజ్ – గెలుపెవరిది

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అనిపించే ప్యాన్ ఇండియా మూవీ రాలేదు. ఈ నెల సర్కారు వారి పాట, ఎఫ్3లతో పాటు మరో నాలుగు చిన్న సినిమాలున్నాయి కానీ ఇవన్నీ కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే పరిమితమైనవి. జూన్ నుంచి మళ్ళీ గ్రాండియర్ల సందడి మొదలుకానుంది. జూన్ 3న జరగబోయే బాక్సాఫీస్ క్లాష్ ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఒకటి అడవి శేష్ మేజర్ కాగా రెండోది అక్షయ్ కుమార్ యుద్ధవీరుడిగా నటించిన పృథ్విరాజ్. రెండూ అయిదు భాషల్లో వస్తున్నాయి.

కాకతాళీయంగానో లేక అనుకుని ప్లాన్ చేసుకున్నారో ఏమో కానీ రెండు ట్రైలర్లూ నిన్నే విడుదలయ్యాయి. మేజర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కి ముంబై టెర్రరిస్టు అటాక్ నేపధ్యంగా తీసుకుని మహేష్ బాబు సోనీ సంస్థలు భాగస్వాములుగా సంయుక్తంగా నిర్మించాయి. ప్రమోషన్ గట్రా చూస్తుంటే కంటెంట్ మీద టీమ్ నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బ్యాక్ డ్రాప్ లో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ వాటిలో లేని క్వాలిటీ ప్రెజెంటేషన్ ఇందులో కనిపిస్తోంది.

ఇక పృథ్విరాజ్ విషయానికి వస్తే ఇది కూడా చరిత్రలో నిలిచిపోయిన నిజజీవిత కథే. యష్ రాజ్ సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించింది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సంజయ్ దత్, సోనూ సూద్, మానుషీ చిల్లర్ ఇలా క్యాస్టింగ్ కూడా గట్టిగా సెట్ చేసుకున్నారు. హిందూ సెంటిమెంట్ ని దట్టంగా వాడేశారు. ఒకరకంగా ఇది కూడా బయోపిక్కే. కథాకాలానికి సంబంధించి రెండు పూర్తి విరుద్ధమైనవే అయినప్పటికీ మెయిన్ పాయింట్ మాత్రం శత్రువులతో యుద్ధం చేయడం. మరి గెలుపు ఎవరిదో చూడాలి