మహేష్ ఎందుకంత ఎమోషనలయ్యాడు?

సూపర్ స్టార్ మహేష్ బాబు మామూలుగా తన సినిమాల వేడుకల్లో చాలా కూల్‌గా కనిపిస్తాడు. తన స్పీచుల్లో ఎలాంటి డ్రామా కానీ, మెలోడ్రామా కానీ అస్సలు ఉండదు. వేరే హీరోల్లాగా స్పీచ్‌ల కోసం తెగ ప్రిపేరై రాడు. అభిమానులతో ఈలలేయించాలనో, ఇంకో ఉద్దేశంతోనో స్పీచ్‌లను రక్తి కట్టించే ప్రయత్నం ఏదీ చేయడు. వేదిక మీదికొచ్చి క్యాజువల్‌గా, రొటీన్‌గా కొన్ని మాటలు మాట్లాడేసి వెళ్లిపోతుంటాడు. ఈ విషయంలో అభిమానులు డిజప్పాయింట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఐతే తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అభిమానులకు వేదిక మీద కొత్త మహేష్ కనిపించాడు. ఎన్నడూ లేని విధంగా మహేష్ ఎమోషనల్ అయి, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటున్నట్లు కనిపించాడు. ఒక దశలో ఏడ్చేస్తాడేమో అనిపించింది కానీ.. వెంటనే తమాయించుకుని నార్మల్ అయ్యాడు.

కరోనా కారణంగా చాన్నాళ్ల పాటు ఇంటికి పరిమితం కావడం, అభిమానులతో పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోవడంతో మహేష్ ఫీలైనట్లే ఉన్నాడు. మళ్లీ ఇంత మంది అభిమానుల మధ్యకు వచ్చి, వారి ప్రేమను చవి చూసేసరికి మహేష్ ఎమోషనల్ అయినట్లు కనిపించింది. అందుకే ప్రసంగం ఆరంభంలో ఎమోషనల్‌గా కనిపించాడు. ఇక చివరికి వచ్చేసరికి మహేష్‌లో మరోసారి ఎమోషన్ కనిపించింది. గత రెండేళ్లలో తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోయానని మహేష్ అన్నాడు. అందులో ఒకరు ఆయన తోడబుట్టిన సోదరుడు రమేష్. మహేష్, రమేష్ బయట కలిసి పెద్దగా కనిపించకపోవచ్చు కానీ.. వాళ్లిద్దరూ చాలా క్లోజ్. తోడబుట్టిన వాడు తక్కువ వయసులోనే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

ఇక మహేష్ కోల్పోయిన మరో దగ్గరి వ్యక్తి బీఏ రాజు. చిన్నతనం నుంచి సినీ రంగంలో ఆయన వేలు పట్టుకుని నడిచిన మహేష్‌కు ఆయన్ని కోల్పోవడం పెద్ద షాకే. రాజు కృష్ణ, మహేష్‌లకు కుటుంబ సభ్యుడి లాంటి వాడే. ఇలా తన జీవితంలో ఇద్దరు ముఖ్య వ్యక్తులను కోల్పోవడం మహేష్ ఎమోషనల్ అవ్వడానికి మరో కారణం.