మాస్ పల్స్ పట్టేసుకున్న సర్కారు

ఇందాక విడుదలైన మహేష్ బాబు సర్కారు వారి పాట ట్రైలర్ ఆన్ లైన్లో గంటలు గడవక ముందే మిలియన్ వ్యూస్ బోణీ కొట్టేసి అంతకంతా ఆ నెంబర్ పెంచుకుంటూ పోతోంది. నిన్నటి నుంచే నిర్మాణ సంస్థ మైత్రి సోషల్ మీడియా వేదికగా అభిమానులను బాగా ఊరిస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే వీడియో కంటెంట్ ఉండటంతో రికార్డులు బద్దలు కావడం ఖాయమని బల్లగుద్ది చెబుతున్నారు.

ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉండటం, కీర్తి సురేష్ ని గ్లామరస్ గా చూపించడం లాంటివి హైప్ పెంచడానికి తోడ్పడేలా ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ మాస్ పల్స్ ని సరిగ్గా పట్టేశాడు. మహేష్ గత కొన్నేళ్లుగా ఊర మాస్ క్యారెక్టర్లో కనిపించలేదు.

హుందాగా ఉండే వ్యాపారవేత్తగానో బాధ్యత కలిగిన ఆర్మీ ఆఫీసర్ గానో ఇలా కొన్ని పరిమితులున్న పాత్రలు చేయడం వల్ల తనలో దాగున్న గొప్ప కమర్షియల్ యాంగిల్ బయటికి రాకుండా పోయింది. దాన్ని పరశురామ్  వెలికి తీశాడు. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు అన్నీ మిక్స్ చేసి ఫ్యాన్స్ కోరుకున్నది సంపూర్ణంగా ఇచ్చేశాడు.

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 తర్వాత ఆచార్య బోల్తా కొట్టడంతో బాక్సాఫీస్ వద్ద ఏర్పడ్డ వెలితిని సర్కారు వారి పాటే పూడ్చాల్సి ఉంటుంది. దానికి తగ్గ సరుకు సినిమాలో ఉందనే అభిప్రాయం కలిగించడంలో సక్సెస్ అయ్యాడు పరశురామ్. ముందు నుంచు చెబుతున్నట్టే మహేష్ బాడీ లాంగ్వేజ్, బాషని స్పెషల్ గా డిజైన్ చేసుకున్నాడు. సినిమా కనక అంచనాలు సగం నిలబెట్టుకున్నా చాలు పాత రికార్డుల బూజు దులపొచ్చు. సరిగ్గా పది రోజుల్లో సర్కారు వారి పాట థియేటర్లలో రాబోతోంది. చూడాలి రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో