ఆచార్యకు ఇచ్చారు.. అన్నిటికీ ఇస్తారా?

అనుకున్నదే అయింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’కు ఆంధ్రప్రదేశ్‌లోనూ టికెట్ల రేట్ల పెంపుకు అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సులు అని తేడా లేకుండా అన్నింట్లోనూ టికెట్ మీద రూ.50 పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. తెలంగాణలో మల్టీప్లెక్సుల్లో 50, సింగిల్ స్క్రీన్లలో 30 మాత్రమే మాత్రమే పెంపు కాగా.. ఏపీలో మాత్రం అన్ని స్క్రీన్లకూ ఒకేలా 50 రేటు పెంచడం గమనార్హం. ఐతే ఈ పెంపు నిబంధనల ప్రకారమే జరిగిందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

రెండు నెలల కిందటే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం హీరో హీరోయిన్లు, దర్శకుడి పారితోషకాలు కాకుండా బడ్జెట్ రూ.100 కోట్లు దాటితే, ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం షూటింగ్ జరుపుకుంటేనే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఐతే ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన వాటికి ‘20 శాతం’ నిబంధన వర్తింపజేయలేరు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. కానీ పారితోషకాలు కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ అయితేనే రేట్ల పెంపుకు అవకాశం ఇవ్వాలన్నది స్పష్టం.

రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు ఇలాగే ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు. ఐతే ఈ పెంపు ‘రాధేశ్యామ్’కు ఒకలా.. ‘ఆర్ఆర్ఆర్’ ఒకలా ఉండడంలో ఆంతర్యమేంటో అర్థం కాలేదు. రాజమౌళి ఏపీ సీఎంను వ్యక్తిగతంగా కలవడంతో ఆయన సినిమాకు అదనపు ప్రయోజనం చేకూరేలా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక రెండు వారాల కిందట రిలీజైన ‘కేజీఎఫ్-2’ సినిమా బడ్జెట్ షరతుల్లో ఫిట్ అవుతున్నప్పటికీ దానికి రేట్ల పెంపు అవకాశం ఇవ్వలేదు.

డబ్బింగ్ సినిమాలకు ఈ అవకాశం లేదని నిబందనల్లో అయితే పేర్కొనలేదు. ఆ చిత్రానికి తెలంగాణలో మాత్రం రేట్ల పెంపుకు ఛాన్సిచ్చారు. ఏపీలో ఇవ్వలేదు. ఇక ‘ఆచార్య’ విషయానికి వస్తే పారితోషకాలు కాకుండా దీని బడ్జెట్ రూ.100 కోట్లు అవ్వలేదు. అయినా ఎలా రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారన్నది ప్రశ్న. చిరుకు జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఏపీ సీఎంకు చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి లాయర్ కావడం వల్లే ఈ అవకాశం దక్కిందనే చర్చ మొదలైంది. మరి మున్ముందు ఏ సినిమాకు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. మొత్తానికి రూల్ బుక్ తమకు అనుకూలం కాని వారిని ఇబ్బంది పెట్టడానికే తప్ప నిజంగా ఇందులో చిత్తశుద్ధి ఏమీ లేదని స్పష్టంగా తెలిసిపోతోంది.