చైతూ సినిమా తర్వాత ఆ సీక్వెలే

కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్నందుకోకపోయి ఉండొచ్చేమో కానీ.. ఇటు హీరో సూర్య కెరీర్లో, అటు దర్శకుడు విక్రమ్ కుమార్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ‘24’ ఒకటి. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను విక్రమ్ అద్భుత రీతిలో మలిచాడు. సూర్య అదిరిపోయే పెర్ఫామెన్స్‌తో అలరించాడు. దర్శకుడిగా విక్రమ్, హీరోగా సూర్య తమ పతాక స్థాయిని చూపించిన చిత్రమిది.

కాకపోతే ఈ చిత్రానికి దక్కాల్సిన స్థాయి విజయం దక్కలేదు. బొటాబొటి వసూళ్లతో సరిపెట్టుకుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిపోయే ఈ చిత్రం ఇప్పుడెక్కడైనా టీవీల్లో వస్తుంటే.. ప్రేక్షకులు అతుక్కుపోయి చూడాల్సిందే. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఐతే బాక్సాఫీస్ సక్సెస్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లో ఏమో.. సూర్య, విక్రమ్ ఆ దిశగా వెంటనే అడుగులు వేయలేదు.

ఐతే ‘24’కు సీక్వెల్ లేదనుకోవడానికి మాత్రం లేదని అంటున్నాడు విక్రమ్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విక్రమ్ మాట్లాడుతూ.. ‘24’ సీక్వెల్ మీద పని చేస్తున్నట్లు చెప్పాడు. ‘24’ చేస్తున్నపుడే దీనికి సీక్వెల్ చేయాలని తాను, సూర్య అనుకున్నామని.. ఆ తర్వాత కూడా ఒకట్రెండుసార్లు చర్చించుకున్నామని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పాడు విక్రమ్.

ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే ప్రయత్నంలో ఉన్నాడు విక్రమ్. దాని తర్వాత ‘24’ సీక్వెల్ పట్టాలెక్కొచ్చని భావిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇండియాలో మాత్రం ఈ జానర్‌ను టచ్ చేసిన వాళ్లు తక్కువ. ‘ఆదిత్య 369’ తర్వాత ‘24’తో పాటు తమిళంలోనే ‘ఇండ్రు నేట్రు నాల్’ అనే మరో మంచి సినిమా ఈ జానర్లో వచ్చాయి. తొలి ప్రయత్నంలో అదిరిపోయే ఔట్‌పుట్ ఇచ్చిన విక్రమ్-సూర్య.. ఈసారి జట్టుకడితే ఎలాంటి సినిమా అందిస్తారో.. దానికెలాంటి ఫలితం అందుతుందో చూడాలి.