చిరుయే సాక్షి.. నాడు అవమానం, నేడు గర్వం

ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాదిన సౌత్ సినిమాలు సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం చూసి బాలీవుడ్ వాళ్లు లోలోన కుళ్లి కుళ్లి ఏడుస్తుంటే ఆశ్చర్యమేమీ లేదు. ఒకప్పుడు సౌత్ సినిమాలను వాళ్లెంత తక్కువగా చూసే వారో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అన్నట్లు వాళ్ల బిల్డప్ ఉండేది. బయటి ప్రపంచం కూడా అలాగే చూసేది. ఇండియన్ సినిమాలో ఓవరాల్ రికార్డులేవైనా హిందీ చిత్రాల పేరిటే ఉండేవి.

దీనికి తోడు అవార్డుల్లోనూ వారిదే ఆధిపత్యం. అక్కడ తెరకెక్కే మామూలు సినిమాలకు కూడా అవార్డులు వెల్లువెత్తేవి. సౌత్‌లో ఎంత గొప్ప సినిమాలు తీసినా అంతగా గుర్తింపు ఉండేది కాదు. ఇదంతా బాక్సాఫీస్ డైనమిక్స్‌ను బట్టే ఉండేదన్నది స్పష్టం. కానీ గత కొన్నేళ్లలో కథ మారిపోయింది. బాలీవుడ్ సినిమాల హవాకు తెరపడింది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి దక్షిణాది చిత్రాల ఆధిపత్యం మొదలైంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2.. ఇలా గత కొన్ని నెలల్లో నార్త్ బాక్సాఫీస్‌ను సౌత్ సినిమాలు దున్నేశాయి.

వీటి దెబ్బకు హిందీ చిత్రాలు కుదేలయ్యాయి. ఇప్పుడు మన సినిమాలను చూసి బాలీవుడ్ వాళ్లు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. 80 దశకం చివర్లో తాను ‘రుద్రవీణ’ సినిమాకు నర్గీస్ దత్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్లినపుడు అక్కడ ఆడిటోరియంలో మొత్తం బాలీవుడ్ సినిమాలకే పెద్ద పీట వేసి.. సౌత్ సినిమాలకు అసలు ప్రయారిటీనే ఇవ్వకపోవడం, తెలుగు సినిమాలకు అసలే గుర్తింపూ లేకపోవడం చూసి అవమానంగా భావించానని.. ఇదే విషయాన్ని చెన్నైకి వచ్చాక మీడియా ముందు కూడా చెప్పానని.. హిందూ పత్రిక ఆ విషయానికి మంచి ప్రయారిటీ ఇచ్చినా సరే.. దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదని చిరు వెల్లడించాడు.

ఐతే ఇప్పుడు బాహుబలితో రాజమౌళి మొత్తం కథ మార్చేశాడని.. ఇప్పుడు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి చిత్రాల జోరుతో ప్రాంతీయ సినిమాపై వివక్ష తొలగిపోయిందని.. మన సినిమాలను ఇండియన్ సినిమాలుగా అందరూ గుర్తిస్తున్నారని.. నాడు సౌత్ సినిమాను తక్కువగా చూశారని అవమానంగా భావించిన తనే.. ఇప్పుడు మన సినిమాలను చూసి గర్వంతో రొమ్ము విరుచుకుంటున్నానని చిరు చాలా ఉద్వేగంగా అన్నారు. ఇటు సౌత్ సినీ జనాలు, అటు ప్రేక్షకులు అందరి మనోభావాలను ప్రతిబింబించేలా చిరు చేసిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.