రజినీ సినిమా క్యాన్సిలైందా?

నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల), శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘డాక్టర్’ సినిమాలతో కోలీవుడ్లో హాట్ టాపిక్ అయిపోయాడు యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఆ రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘డాక్టర్’ ఇక్కడ మంచి హిట్టయింది. డార్క్ నేచర్ ఉన్న థ్రిల్లర్ కథాంశాలను ఎంచుకుని.. వినోదాత్మకంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రేక్షకుల మనసులు దోచాడు నెల్సన్.

‘డాక్టర్’ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే విజయ్ లాంటి టాప్ స్టార్ అతడితో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ వీరి కలయికలో సినిమాను నిర్మించింది. అదే.. బీస్ట్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. తమిళనాడు వరకు వీకెండ్లో కొంచెం సందడి చేసి, ఆ తర్వాత చతికిలపడింది. మొత్తంగా విజయ్ ఖాతాలో చాన్నాళ్ల తర్వాత ఒక ఫ్లాప్ జమ అయింది.

ఐతే ‘బీస్ట్’ సినిమా ఫలితం తిరగబడడంతో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో దిలీప్ చేయాల్సి ఉన్న కొత్త చిత్రం క్యాన్సిల్ అయినట్లుగా రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని ‘బీస్ట్’ రిలీజ్‌‌కు ముందే ఘనంగా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఖరారయ్యాడు.

ఐతే ‘బీస్ట్’ నిరాశ పరచడంతో నెల్సన్ మీద రజినీ, సన్ పిక్చర్స్ అధినేతలకు నమ్మకం పోయిందని.. దీంతో సినిమాను ఆపేస్తున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే దీనికి నెల్సన్ సమాధానం ఇచ్చాడు. ఈ రూమర్లపై నేరుగా స్పందించకుండా.. ‘బెటర్ లక్ నెక్స్ట్ టైమ్’ అంటూ సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టాడు. అలాగే తన ట్విట్టర్ బయోలో కొత్తగా ‘తలైవర్ 169’ అంటూ ఈ సినిమాను సూచించే హ్యాష్ ట్యాగ్ జోడించి ఈ చిత్రం క్యాన్సిలేమీ కాలేదని, కచ్చితంగా ఉంటుందని చెప్పకనే చెప్పాడు నెల్సన్.