పూజా కుద‌ర‌ద‌న్నాకే ర‌ష్మిక‌

పూజా హెగ్డే.. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండ‌స్ట్రీలో ఈమెదే అగ్ర‌స్థానం అతిశ‌యోక్తి కాదు. తెలుగులో ఆమె కొన్నేళ్ల నుంచి నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా ఉంటోంది. ఇటీవ‌లే బీస్ట్ లాంటి భారీ చిత్రంతో త‌మిళంలోకి రీఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంది. గ‌తంలోనే త‌మిళంలోనే మాస్క్ అనే సినిమా చేసిన‌ప్ప‌టికీ.. అప్ప‌టికి ఆమెకు పెద్ద‌గా గుర్తింపు లేదు. ఇప్పుడు ఏకంగా విజ‌య్ సినిమాతో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

తెలుగుతో పాటు  హిందీలోనూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్న పూజా.. విజ‌య్ హీరోగా ఇటీవ‌లే మొదలైన కొత్త సినిమాలోనూ క‌థానాయిక‌గా చేయాల్సింద‌ట‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందు అనుకున్న క‌థానాయిక పూజానేన‌ట‌.

కానీ డేట్ల స‌మ‌స్య కార‌ణంగా పూజా ఈ సినిమా చేయ‌లేన‌న‌డంతో ర‌ష్మిక మంద‌న్నను ఎంచుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. పూజాతో క‌లిసి బీస్ట్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజే స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. బీస్ట్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజే రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా విజ‌య్-వంశీ క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌నున్న సినిమాకు క‌థానాయిక ఎవ‌రు అన్న చ‌ర్చ వ‌చ్చిన‌పుడు పూజాను తీసుకుందామ‌ని తానే సూచించానని, విజ‌య్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాడ‌ని, పూజా గురించి బాగా మాట్లాడాడ‌ని, కానీ డేట్లు స‌ర్దుబాటు చేయ‌లేక‌పోవ‌డంతో ఈ సినిమాలో ఆమె భాగం కాలేక‌పోయింద‌ని రాజు తెలిపాడు. రాజు నిర్మించిన దువ్వాడ జ‌గ‌న్నాథంతోనే సౌత్‌లో పూజా ద‌శ తిరిగింది. ఆ త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన మ‌హ‌ర్షి ఆమె కెరీర్లో అప్ప‌టికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.