‘RRR’లో ఆ పాప ఎవరు?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధానంగా హైలైట్ అయింది హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లే. సినిమా మొత్తాన్ని వీళ్లిద్దరే తమ భుజాల మీద నడిపించారు. మిగతా పాత్రల్లో నటించిన ముఖ్య నటీనటులకు అనుకున్నంత స్కోప్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించిన ఆలియా భట్.. తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యం దక్కకపోవడంపై అలక పూనినట్లు కూడా వార్తలొస్తున్నాయి.

ఐతే హీరోలు కాకుండా మిగతా వాళ్లలో పెద్ద నటుల్ని మించి ప్రాధాన్యం దక్కించుకుంది ఓ చిన్నారి. మల్లి అనే అడవి బిడ్డ పాత్రలో నటించిన ఆ పాప అందరినీ ఆకట్టుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ కథ మొదలయ్యేది.. ముందుకు సాగేది ఈ పాత్రతోనే. భీమ్ పాత్రకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించేది కూడా ఈ క్యారెక్టరే. ఈ కీలకమైన పాత్రలో నటించిన చిన్నారి చూడగానే అందరినీ కట్టిపడేసింది. తను కనిపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కదిలించింది.

అందరూ ఈ పాప మన తెలుగమ్మాయే అయ్యుంటుందని అనుకున్నారు. కానీ ఆ చిన్నారి ఉత్తరాది అమ్మాయి కావడం విశేషం. తన పేరు..  ట్వింకిల్ శర్మ. ఈ అమ్మాయిది ఛండీగఢ్. మరి అక్కడి అమ్మాయి రాజమౌళి దృష్టిలో ఎలా పడింది.. ‘ఆర్ఆర్ఆర్’లో ఎలా అవకాశం దక్కించుకుంది అన్నది ఆసక్తికరం. ట్వింకిల్ అంతకు ముందు ‘డాన్స్ ఇండియా డాన్స్’ అనే  ప్రోగ్రాంలో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ తర్వాత మరికొన్ని టీవీ షోస్ చేసింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌‌గా ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలో ఆమెను చూసిన రాజమౌళి తనను ఆడిషన్‌కు పిలిచారట. ‘ఆర్ఆర్ఆర్’ టీం చండీగఢ్‌ నుంచి హైదరాబాద్‌కు విమాన టిక్కెట్లు బుక్ చేసి మరీ తనను రప్పించి ఆడిషన్ చేసింది. రాజమౌళికి నచ్చడంతో మల్లి పాత్రకు ఓకే అయింది. సినిమాలో చూడ్డానికి మరీ చిన్న పిల్లలా కనిపిస్తుంది కానీ.. ఇమె ఇప్పుడు పదో తరగతి చదువుతుండటం విశేషం. సినిమా మొదలయ్యేటప్పటికి మాత్రం ట్వింకిల్ ఎనిమిదో తరగతిలో ఉందట. ప్రస్తుత పరిస్థితుల్లో రాజమౌళితో సినిమా అంటే.. మొదలైన మూడేళ్లకు విడుదల కావడంలో ఆశ్చర్యమేముంది?