పూరి డ్రీమ్ ప్రాజెక్టులో అతడికేం పని?

జనగణమన.. దాదాపు దశాబ్దం నుంచి చర్చల్లో ఉన్న సినిమా. టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబు హీరోగా ఈ పేరుతో సినిమా తీయాలని ఆశించారు. ‘బిజినెస్ మేన్’ తర్వాత రావాల్సిన ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కలేదు. ఒక దశలో ఆసక్తిగానే ఉన్న మహేష్.. ఆ తర్వాత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే అందుక్కారణం. చేస్తే మహేష్‌తోనే చేయాలని, లేదంటే వద్దని పూరి ఒక దశలో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు.

ఐతే తనతో విజయ్ దేవరకొండ ‘లైగర్’ చేశాక.. అతడితో తన డ్రీమ్ ప్రాజెక్టును చేయొచ్చని పూరికి నమ్మకం కుదిరింది. విజయ్ కూడా ఓకే అనడంతో ఈ సినిమాకు చకచకా సన్నాహాలు జరిగిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు వార్తలొచ్చాయి. కాకపోతే ఇంకా దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఆ తంతు కూడా పూర్తయింది.‘జేజీఎమ్’ అంటూ షార్ట్ నేమ్‌తో సినిమాను అనౌన్స్ చేసింది చిత్ర బృందం.

ఇది యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమా అన్నట్లుగా ప్రి లుక్ డిజైన్ చేశాడు పూరి. అది ఆసక్తికరంగానే అనిపిస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్ రోజే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడం విశేషం. 2023 ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లైగర్’ లాగే ఇది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం. ఇందులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. పూరి గత సినిమాల్లాగే ఈ చిత్రంలోనూ ఆయనతో పాటు ఛార్మి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

వీరికి ఇంకో వ్యక్తి కూడా తోడయ్యారు. అది దర్శకుడు వంశీ పైడిపల్లి కావడమే ట్విస్ట్. పాన్ ఇండియా సినిమా అంటే.. ఏ కరణ్ జోహార్ లాంటి వాళ్లనో భాగస్వాములుగా చేర్చుకుంటారని అనుకున్నారు కానీ.. ఆశ్చర్యకరంగా వంశీ లైన్లోకి వచ్చాడు. పూరితో కానీ, విజయ్‌తో కానీ అతడికి వేరే కనెక్షన్లేమీ లేవు. వీరితో అతనెప్పుడూ కలిసి పని చేసింది లేదు. ఇప్పటిదాకా వంశీ నిర్మాతగా సినిమా చేసిందీ లేదు. మరి పర్టికులర్‌గా ఈ సినిమాలో అతను భాగస్వామి కావడమేంటో అర్థం కావడం లేదు. దీని వెనుక మర్మమేంటో చిత్ర బృందమే చెప్పాలి.