రికార్డ్ బ్రేక్ దిశగా రాధేశ్యామ్

రాధేశ్యామ్.. కరోనా మహమ్మారి మొదలయ్యాక ఇండియాలో రిలీజైన అతి పెద్ద సినిమా. విడుదల ముంగిట దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల వరకు ఓపెనింగ్స్ విషయంలో ఓకే అనిపించినా.. మిగతా ప్రాంతాల్లో తొలి రోజు నుంచే ఈ చిత్రం వసూళ్ల పరంగా తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడేమో వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి.

నాలుగో రోజు, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టిందీ చిత్రం. సోమవారం అంటే వసూళ్ల డ్రాప్ మామూలే కానీ.. ఈ సినిమా మరీ డల్లయిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల అవతల అయితే పరిస్థితి ఏమీ బాగా లేదు. నార్త్ ఇండియాలో హిందీ వెర్షన్ రోజు మొత్తం నెట్ వసూళ్లు రూ.2 కోట్ల లోపే ఉన్నాయి. తమిళం, మలయాళ వెర్షన్లు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. ఓవర్సీస్‌లోనూ పరిస్థితి ఏమీ బాగా లేదు.

తెలుగు రాష్ట్రాల అవతల ‘రాధేశ్యామ్’ దాదాపు వాషౌట్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణల్లోనూ సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. వీక్ డేస్‌లో సినిమాకు చెప్పుకోదగ్గ షేర్ వచ్చేలా కనిపించడం లేదు. రెండో వీకెండ్లో సినిమా కాస్త పుంజుకోవచ్చేమో. అంతటితో థియేట్రికల్ రన్ కూడా ముగిసిపోయేలా ఉంది.

ఇప్పటికి ఈ చిత్ర వరల్డ్ వైడ్ షేర్ రూ.75 కోట్లకు అటు ఇటుగా ఉంది. ఇంకా రూ.130 కోట్ల దాకా షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఫుల్ రన్లో రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకోవడమే కష్టంగా ఉంటే.. ఇక బ్రేక్ ఈవెన్ గురించి ఎక్కడ ఆలోచించేది. కాబట్టి కనీసం వంద కోట్ల నష్టంతో ఇండియన్ ఫిలిం హిస్టరీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్‌గా ‘రాధేశ్యామ్’ నిలిచేలా కనిపిస్తోంది. అదే జరిగితే ప్రభాస్ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్ జరిగినట్లే.