చిరు అంత రిస్క్ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య కోసం అభిమానుల నిరీక్ష‌న సుదీర్ఘంగా సాగుతోంది. దీంతో పాటు మొద‌లైన భారీ చిత్రాలు కూడా ఒక్కొక్క‌టే రిలీజైపోతున్నాయి కానీ.. ఆచార్య మాత్రం చాలా ఆల‌స్య‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఆచార్య‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను.. ఇలా తీసిన నాలుగు సినిమాల‌తోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకున్న కొర‌టాల శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

ఈ చిత్ర షూటింగ్ చాన్నాళ్ల ముందే పూర్త‌యినా.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఆల‌స్యం అవుతోంది. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర వ్య‌వ‌హారం ఒక ప‌ట్టాన తెగ‌ట్లేద‌ని అంటున్నారు. సినిమా నిడివి 3 గంట‌లు దాటిపోయింద‌ని.. దాన్ని కుదించే విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నార‌ని ఇప్పుడు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు సినిమాల‌కు సుదీర్ఘ నిడివి ప్ర‌తికూలంగా మారుతుంటుంది.

కొన్ని చిత్రాల‌కు అది స‌మ‌స్య‌గా అనిపించ‌దు. ప్ల‌స్ కూడా అవుతుంది. అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు అందుకు ఉదాహ‌ర‌ణ‌. రంగ‌స్థ‌లం నిడివి విష‌యంలో రిలీజ్ ముంగిట చాలానే చ‌ర్చ న‌డిచింది. ఐతే చిరంజీవే ఆ చిత్రాన్ని ఉన్న‌దున్న‌ట్లుగా రిలీజ్ చేయ‌మ‌ని సుకుమార్ అండ్ టీంకు భ‌రోసా ఇచ్చాడు. ఆయ‌న న‌మ్మ‌కం ఫ‌లించింది.

కానీ రంగ‌స్థ‌లం ఒక ప్ర‌యోగాత్మ‌క సినిమా. అందులోనూ సుక్కు మార్కు ఉంటుంది. కానీ ఆచార్య లాంటి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ అంత నిడివితో ఉంటే క‌రెక్ట్ కాదేమో అన్న భ‌యం యూనిట్ వ‌ర్గాల్లో ఉంద‌ట‌. ఈ సినిమాకు మాత్రం రంగ‌స్థలం లాగా చిరు రిస్క్ చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌. ఈ విష‌యంలో ఇటు చిరు, అటు కొర‌టాల తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నార‌ని.. ఇద్ద‌రి మ‌ధ్య త‌ర్జ‌న భ‌ర్జ‌న న‌డుస్తోంద‌ని.. క‌నీసం పావుగంట కుదిస్తే త‌ప్ప క‌ష్ట‌మ‌ని.. మ‌రి చిరు ఏం చేస్తాడో చూడాల‌ని అంటున్నారు.