సల్మాన్ బ్రదర్స్.. అతడిపై కౌంటర్ ఎటాక్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ‘దబంగ్’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అభినవ్ కశ్యప్.. సల్మాన్ ఖాన్ సంస్థలో దీనికి సీక్వెల్ సినిమా చేయనందుకు గాను అతడి తమ్ముళ్లు తనపై కక్ష గట్టి ఎలా కెరీర్‌ను నాశనం చేశారో చాలా వివరంగా ఒక పెద్ద పోస్టు పెట్టాడు ఫేస్ బుక్‌లో.

‘దబంగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక అభినవ్ పదేళ్లలో చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా (బేషారం) విడుదలకు కూడా అనేక అడ్డంకులు ఎదురయ్యాయని.. సల్మాన్ తమ్ముళ్లు దాని రిలీజ్ ఆపేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారని అభినవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సినిమా చేయడానికి ముందు రెండు బేనర్లలో తాను సినిమాలు కోల్పోవడానికి కారణం కూడా సల్మాన్ తమ్ముళ్లు అర్బాజ్, సోహైల్‌లే అని కూడా అభినవ్ ఆరోపించాడు.

దీనిపై సల్మాన్, అతడి తమ్ముళ్లు ఎలా స్పందిస్తారా అని బాలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది. ఐతే వాళ్లిద్దరూ తీవ్రంగానే స్పందించారు. అభినవ్ మీద కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు. అతడిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు అర్బాజ్, సోహైల్ మీడియాకు వెల్లడించారు. అభినవ్ ఆరోపణలన్నీ అసత్యాలని.. అతను తమ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేశాడని.. ఇందుకు అతడికి తగిన బుద్ధి చెబుతామని అర్బాజ్ అన్నాడు.

అభినవ్‌‌కు ఇప్పటికే వాళ్లు నోటీసులు కూడా పంపినట్లు చెబుతున్నారు. దీనిపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా స్పందించాడు. ఈ విషయంపై తానైతే స్పందించి సమయం వృథా చేసుకోనని అన్నాడు. ఐతే అభినవ్ కెరీర్ ఏమాత్రం ముందుకు సాగకుండా ‘దబంగ్’ తర్వాత ఒక్క చిత్రంతో ఆగిపోయిన నేపథ్యంలో అతడి ఆరోపణల్లో నిజం లేకపోలేదనే జనాలు భావిస్తున్నారు.