ఫేవరెట్ కామెడీ షో ఈజ్ బ్యాక్

Anasuya Bharatwaj

తెలుగు ప్రేక్షకుల్ని ‘జబర్దస్త్’ లాగా అలరించిన కామెడీ షో ఇంకోటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో బూతులుంటాయని.. బాడీ షేమింగ్ ఉంటుందని.. వివిధ వర్గాల మనోభావాలు దెబ్బ తినేలా జోకులుంటాయని.. ఇలా ఎన్ని విమర్శలు చేసినా.. దానికి ఆదరణ అయితే తగ్గట్లేదు. జనాలు విరగబడి ఆ షోను చూస్తుంటారు.

టీవీల్లోనే కాక యూట్యూబ్‌లోనూ లక్షలు, కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి ఈ షోకు. ఐతే లాక్ డౌన్ కారణంగా అన్ని టీవీ కార్యక్రమాల్లాగే ఇది కూడా ఆగిపోయింది. అప్పటికే షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్లతో ఒకట్రెండు వారాలు నడిపించారు కానీ.. ఆ తర్వాత షూటింగ్స్ లేకపోవడంతో పాత ఎపిసోడ్లతో నడిపిస్తున్నారు. వాటికి కూడా మంచి వ్యూయర్‌షిప్పే వచ్చింది. ఐతే ఒక దశ దాటాక బోర్ కొట్టేసి కొత్త ఎపిసోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. వారి నిరీక్షణ ఫలించినట్లే.

వచ్చే వారం నుంచి ‘జబర్దస్త్’ కొత్త ఎపిసోడ్లు ప్రసారం కాబోతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. యాంకర్ అనసూయతో ‘జబర్దస్త్’ ఎపిసోడ్లను ఇప్పటికే చిత్రీకరించారు. రెగ్యులర్ టీం లీడర్లందరూ అందులో పాల్గొని స్కిట్లు చేశారు. సాధ్యమైనంత వరకు అందరూ భౌతిక దూరం పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనల్ని అనుసరిస్తూ స్కిట్లు చేసినట్లు సమాచారం. ఇక లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలుగా వైజాగ్‌లోనే ఉండిపోయిన రష్మి గౌతమ్ కూడా హైదరాబాద్ చేరుకుంది.

ఆమె గురువారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షూటింగ్‌లో పాల్గొంది. లొకేషన్ నుంచి ఫొటో కూడా దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘జబర్దస్త్’లో ఈ వారం ప్రసారమయ్యే స్కిట్లను ముందు వారమే చిత్రీకరిస్తారన్న సంగతి తెలిసిందే. కాబట్టి నిన్న, ఈ రోజు షూట్ చేసిన ఎపిసోడ్లు వచ్చే వారం ప్రసారంలోకి వస్తాయన్నమాట. చాలా మంది గ్రూప్ లీడర్లు కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలోనే స్కిట్లు తయారు చేసినట్లు ‘జబర్దస్త్’ వర్గాల సమాచారం.