చిరు కోసం మేఘనా రాజ్ కన్నీటి పోస్ట్

ఇటీవల దక్షిణాది సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తిన విషయం.. అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా మరణమే. ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా కనిపించే అతను.. 39 ఏళ్ల వయసులోనే హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు. తెలుగులో ‘బెండు అప్పారావు’ సినిమా చేసిన మేఘనా రాజ్‌కు అతను భర్త అనే విషయం మన వాళ్లకు కొంచెం ఆలస్యంగా తెలిసింది.

వీళ్లిద్దరూ పదేళ్ల పాటు ప్రేమలో ఉండి.. రెండేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి చనిపోయే సమయానికి మేఘన గర్భవతి అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అది తెలిశాక అందరూ మేఘనను చూసి అయ్యో అనుకున్నారు. భర్త అంతిమ సంస్కారాల వద్ద.. అతడిని ముద్దాడుతూ మేుఘన పొగిలి పొగిలి ఏడ్చిన వైనం అందరినీ కలచివేసింది.

చిరు మరణం నుంచి కొంచెం కోలుకున్న మేఘన.. ఈ రోజు కాస్త ఓపిక చేసుకుని ఒక హార్ట్ టచింగ్ నోట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తమది ఎంత లోతైన బంధమో అందులో ఆమె వివరించింది. చిరును ఎంతగా మిస్సవుతున్నది హృద్యంగా చెప్పుకొచ్చింది. నేను ఇంటికొచ్చేశా అన్న చిరు మాట వినలేకపోతున్నందుకు.. ప్రతి నిమిషం చిరును తాకలేకపోతున్నందుకు గుండె బరువెక్కుతోందని అంది.

ఐతే చిరు తనను ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాడన్న మేఘన.. తన కోసం అతను తమ చిన్నారి రూపంలో విలువైన బహుమతిని ఇచ్చి వెళ్లాడని.. అది తమ ప్రేమకు గుర్తు అని మేఘన వ్యాఖ్యానించింది. తద్వారా తాను గర్భవతిననే విషయాన్ని మేఘన కన్ఫమ్ చేసింది. తమ బిడ్డను భూమి మీదికి తెచ్చేందుకు, మళ్లీ చిరును చేతులతో పట్టుకునేందుకు, అతడి నవ్వును చూసేందుకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానని అంది మేఘన. చిరు తనలోనే ఉన్నాడని.. తన చివరి శ్వాస వరకు అతను బతికే ఉంటాడని మేఘన హృద్యమైన మాట చెప్పి ఈ పోస్ట్‌ను ముగించింది.