పూరి కి పోటీ గా రెండు ‘జన గణ మన’ లు

ప్రతి డైరెక్టర్‌‌కీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నట్టే పూరి జగన్నాథ్‌కీ ఉంది.. జన గణ మన. ఈ కథని చాలాకాలం క్రితమే రాసుకున్నాడు పూరి. మహేష్‌తో తీయాలని కలలు కూడా కన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి వేరే సినిమాలపై దృష్టి పెట్టాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ టాపిక్ తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండతో ‘జన గణ మన’ తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు పూరి. నిర్మాతల్లో ఒకరైన చార్మి ఆల్రెడీ లొకేషన్ల వేటలో పడింది.

అయితే పూరి తన ప్రాజెక్టు గురించి మళ్లీ ఆలోచించే ఈ గ్యాప్‌లో మరో రెండు భాషల్లో ఇదే టైటిల్‌తో సినిమాలు మొదలయ్యాయి. జయం రవి హీరోగా తమిళంలో ‘జన గణ మన’ తయారవుతోంది. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రవి ‘పొన్నియిన్ సెల్వన్‌’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్‌‌లో విడుదల కానుంది. ‘జన గణ మన’ కూడా త్వరలో విడుదలయ్యే చాన్స్ ఉంది.

అలాగే మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్‌ హీరోగా ‘జన గణ మన’ పేరుతో ఓ సినిమా రెడీ అయ్యింది. సూజర్‌‌ వెంజరమూడు మరో కీలక పాత్రలో నటించాడు. డిజో జోస్ ఆంటోనీ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా పృథ్విరాజ్ ప్రకటించాడు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఈ టైటిల్‌ని దేశభక్తి సినిమాలకు తప్ప మరోదానికి వాడలేం. కాబట్టి మూడు చిత్రాలూ పేట్రియాట్రిక్ మూవీసే అనడంలో సందేహం లేదు. అయితే ఎవరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఏ సినిమా ఎలా ఉండబోతోంది అనేది క్యూరియాసిటీ కలుగుతోంది. అందరి కంటే ముందు పృథ్విరాజ్ వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత జయం రవి కచ్చితంగా వచ్చేస్తాడు. ఇక పూరి ఈ సినిమాని ఎప్పటికి సెట్స్‌కి తీసుకెళ్తాడో, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తాడో, రవి కంటే ముందే వస్తాడా లేక తర్వాత వస్తాడా అనేది చూడాలి మరి.