ఇప్పటికి ఆ సినిమాకి విముక్తి దొరికింది

కరోనా వల్ల చాలా సినిమాలు అనుకున్న టైముకి రాలేకపోయాయి. లాక్‌డౌన్‌ల వల్ల షూటింగులు ఆగిపోవడం.. అష్టకష్టాలు పడి పూర్తి చేసినా విడుదల చేయడానికి థియేటర్లు లేకపోవడం వంటి కారణాలతో ఏర్పడిన డిలే అది. అయితే విక్రమ్ నటించిన ఓ సినిమా అయిదేళ్లుగా పురుటినొప్పులు పడుతోంది. ఎట్టకేలకి ఇప్పటికి దానికి విముక్తి దొరికింది.

ధృవనక్షత్రం.. ఈ సినిమా మొదలై అయిదేళ్లయ్యింది. కానీ నిజానికి దీని చరిత్ర అంతకు నాలుగేళ్ల ముందే మొదలయ్యింది. మొదట సూర్య, దీపికా పదుకొనెలతో ఈ సినిమాని ప్లాన్ చేశాడు గౌతమ్ మీనన్. సింగిల్‌ మూవీగా కాకుండా ఓ ఫ్రాంచైజీలా తీయాలనుకున్నాడు. తానే నిర్మించాలని డిసైడయ్యాడు. ఏవో కారణాల వల్ల దీపిక తప్పుకోవడంతో త్రిషని హీరోయిన్‌గా ఫిక్సయ్యాడు. అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. వరుస పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు. అంతలో సూర్యకి, మీనన్‌కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. స్క్రిప్ట్ ఎంతకీ పూర్తి కాకపోవడంతో విసిగిపోయిన సూర్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో సినిమా ఆగిపోయింది.

ఆ తర్వాత జయం రవితో ఈ మూవీ చేయాలనుకున్నాడు గౌతమ్. అతని బిజీ షెడ్యూల్స్‌ కారణంగా వీలు కాలేదు. తర్వాత ప్రాజెక్ట్ విక్రమ్ చేతికి వెళ్లింది. అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా సెలెక్టయ్యింది. విదేశాల్లో షూట్ చేసి మరీ అనౌన్స్‌మెంట్ టీజర్‌‌ను వదిలారు. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ రావడంతో మళ్లీ బ్రేక్ పడింది. ఆ పరిస్థితి కొన్నాళ్లపాటు కంటిన్యూ అవ్వడంతో అను తప్పుకుంది. ఆమె ప్లేస్‌లోకి రీతూవర్మ వచ్చింది. ఐశ్వర్యా రాజేష్‌ మరో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్‌‌ లాంటి వారంతా ముఖ్య పాత్రలకు ఫిక్సయ్యారు. ఎట్టకేలకి 2017లో సినిమా సెట్స్‌కి వెళ్లింది.

అప్పటి నుంచి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆపసోపాలు పడుతూనే ఉంది. షూటింగ్ పూర్తయ్యేసరికి విక్రమ్ బాగా బిజీ అయిపోయాడు. చేతి నిండా సినిమాలు. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పలేని పరిస్థితి. దాంతో ప్రాజెక్టుని అలా పెట్టుకుని కూర్చున్నాడు గౌతమ్. అతనూ వేరే సినిమాలు చేసుకోవడంలో మునిగిపోయాడు. ఎట్టేకేలకి ఈ యేడు సినిమాని విడుదల చేయాలని డిసైడయ్యారు. మణిరత్నం డైరెక్షన్‌లో విక్రమ్ నటిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌ సమ్మర్‌‌లో రిలీజవ్వాల్సి ఉంది. కానీ అది సెప్టెంబర్‌‌కి వెళ్లిపోవడంతో వేసవికి ధృవనక్షత్రం రిలీజైపోతే బెటరని విక్రమ్ ఫీలయ్యాడట. దాంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. రీసెంట్‌గా విక్రమ్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయడంతో ధృవనక్షత్రం ఇక బైటికి రావడం ఖాయమనిపిస్తోంది.