పండ‌గ పూట ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ను ఇలా బాధ‌పెట్టారేంటి..?

టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న చేతిలో ఉన్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒక‌టి. టి సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్‌, ప్రశాంత్ సుతార్ క‌లిసి నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి స‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీ ఖాన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ మైథలాజికల్ వండర్ 11 ఆగస్ట్‌ 2022న విడుదల కావాల్సి ఉంది.

అయితే, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాను మేక‌ర్స్ వాయిదా వేశారు. దీంతో ఈ ఏడాది చివ‌ర్లో అయినా ఆదిపురుష్ థియేట‌ర్స్‌లోకి వ‌స్తుందేమో అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ భావించారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది. ఈ చిత్రాన్ని ఏకంగా వ‌చ్చే ఏడాదికి షిప్ట్ చేశారు. నేడు మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.

ఆదిపురుష్ చిత్రం 3డి ఫార్మాట్‌లో సంక్రాంతి కానుక‌గా 12 జనవరి 2023న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో వ‌చ్చే ఏడాది వ‌ర‌కు వెయిట్ చేయాలా అంటూ ప్ర‌భాస్ ఫ్యాన్స్ తెగ బాధ ప‌డుతున్నారు. కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ‌రుపుకుంటున్న ఆదిపురుష్ చిత్రానికి సాచేత్‌ తాండన్‌, పరంపరా ఠాకూర్‌లు సంగీతం అందిస్తున్నారు. రామాయణంలో ఉన్న అన్ని మెయిన్ పాయింట్లను ఇందులో చూపించ‌బోతున్నారు.